రోజా ఇష్యూ: బాలకృష్ణ కాల్పులు కేసును వాదించిన లాయరే బాబుపై పిల్ వేశారు
హైదరాబాద్: హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ, వైసీపీకి చెందిన ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీకి అనుమతించకపోవడంపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు, స్పీకర్ కోడెల శివప్రసాదరావులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ సోమవారం హైకోర్టులో పిల్ దాఖలైన సంగతి తెలిసిందే.
హైకోర్టు ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బేఖాతరు చేయడంపై పిల్ దాఖలు చేసిన వ్యక్తి ఎవరో తెలుస్తే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే. హైకోర్టుతో పాటు దేశంలోని పలు హైకోర్టులు, సుప్రీం కోర్టులో కూడా పలు కీలక కేసులను వాదించిన న్యాయవాది గోపాలకృష్ణ కళానిధి ఈ పిల్ ను దాఖలు చేశారు.
కాగా గోపాలకృష్ణ కళానిధి విషయానికి వస్తే... గతంలో టాలీవుడ్ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కేసుని కూడా ఈయనే వాదించడం విశేషం. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో సినీ నిర్మాత బెల్లంకొండ సురేశ్, జ్యోతిష్యుడు సత్యనారాయణ చౌదరిలపై బాలకృష్ణ తన ఇంటిలోనే కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.

ఈ కేసులో హీరో బాలకృష్ణ తరుపున గోపాలకృష్ణ కళానిధి కోర్టులో వాదనలు వినిపించారు. అంతేకాదు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు చిత్రం 'ఖలేజా' చిత్రం టైటిల్కు సంబంధించిన కేసులోనూ ఈయనే వాదనలు వినిపించారు. అప్పట్లో దేశవ్యాప్తంగా సంచనలం సృష్టించిన ఆమ్ వే ఇండియా ఎంటర్ప్రైజేస్ కేసును కూడా ఈయనే వాదించారు.
కృష్ణాజిల్లాలోని ఓ మారుమూల గ్రామమైన సింగరాయపాలెంలో జన్మించిన కళానిధి తన విద్యాభ్యాసం ముగిసిన తర్వాత హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేపట్టారు. ఆ తర్వాత ఆయన పలు కేసుల్లో వాదనలు వినిపించి అనతి కాలంలో న్యాయవాది వృత్తిలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు.

హైదరాబాద్లోని రామాంతపూర్లో ఆయన స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఇప్పుడు తాజాగా సీఎం చంద్రబాబు, స్పీకర్ కోడెలపై పిల్ దాఖలు చేయడంతో మరోసారి వార్తల్లోకెక్కారు. ఈ పిల్పై హైకోర్టు మంగళవారం విచారణ జరపనున్నట్లు సమాచారం.
హైకోర్టు ఆదేశాలతో అసెంబ్లీకి వెళ్లిన రోజాను ప్రభుత్వం అడ్డుకున్న విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయకుండా ప్రభుత్వం నిరంకుశ ధోరణితో వ్యవహరించడం పట్ల పలువురు న్యాయ నిపుణులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications