ఏపీలో స్కూళ్లు తెరవొద్దంటూ హైకోర్టులో పిటిషన్- టీచర్లకు వ్యాక్సినేషన్ పూర్తికాకుండా..
ఏపీలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం దాదాపుగా తగ్గుతోంది. దీంతో ప్రభుత్వం ఆగస్టు 16న పాఠశాలల్ని తిరిగి తెరవాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించింది. వరుసగా రెండో ఏడాది విద్యాసంవత్సరం నష్టపోకుండా విద్యార్ధుల్ని పాఠశాలలకు రప్పించాలని నిర్ణయించింది. అయితే దీనిపై అప్పుడే అభ్యంతరాలు మొదలయ్యాయి. ఓవైపు తల్లితండ్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా.. మరోవైపు హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది.
ఏపీలో ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టులో తాజాగా ఓ ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది. ఏపీలో ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిస్ధితుల్లో పాఠశాలల్ని పునఃప్రారంభించాలన్న ప్రభుత్వ నిర్ణయం సరికాదని హైకోర్టులో పిటిషనర్ పేర్కొన్నారు. దీంతో హైకోర్టు ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించింది. ఇవాళ జరిగిన విచారణలో పిటిషనర్ తో పాటు ప్రభుత్వం కూడా తమ వాదనలు వినిపించారు.
ఏపీలో కరోనా పూర్తిగా తగ్గకుండా స్కూళ్లు ప్రారంభిస్తున్నప్పటికీ టీచర్లకు వ్యాక్సినేషన్ మాత్రం చేయిస్తున్నట్లు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అయితే పిటిషనర్ ఇంకా ఉపాధ్యాయులకు పూర్తి,స్ధాయిలో వ్యాక్సినేషన్ పూర్తి కాలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. టీచర్లకు వ్యాక్సినేషన్ పూర్తి కాకుండా పాఠశాలలు ఎలా తెరుస్తారని ప్రశ్నించారు. దీంతో ప్రభుత్వం ఉపాధ్యాయులకు 85 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేశామని తెలిపింది. మిగిలిన వారికి కూడా త్వరలో వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని హైకోర్టుకు తెలిపింది. దీనిపై హైకోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది.
మరోవైపు ఆగస్టు 16 నుంచి స్కూళ్లు తెరవాలని నిర్ణయించిన ప్రభుత్వం.. టీచర్లకు వ్యాక్సినేషన్ మాత్రం ఇంకా పూర్తి చేయలేకపోయింది. దీంతో విద్యార్ధుల తల్లితండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్కూళ్లు తెరిచినా తమ పిల్లల్ని పంపించేందుకు మాత్రం ఆసక్తి చూపడం లేదు. కోవిడ్ ధర్డ్ వేవ్ భయాల వేళ ప్రభుత్వం స్కూళ్లు తెరిచేందుకు చేస్తున్న ప్రయత్నాలపై తల్లితండ్రులు అసంతృప్తిగా ఉన్నారు దీంతో ప్రభుత్వం కూడా విద్యార్ధుల్ని తల్లితండ్రుల అంగీకారంతో స్కూళ్లకు పంపేలా ఆప్షన్ ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.