తిరుమల కాలినడక భక్తులకు తీపి కబురు
తిరుమల: కాలినడకన తిరుమలకు వచ్చే భక్తులకు ఇకపై నిత్యం 20వేల దివ్యదర్శనం టోకెన్లను జారీ చేయనున్నట్లు తిరుమల తిరుతిప దేవస్థానం(టీటీడీ) జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు. అన్నమయ్యభవన్లో టీడీడీ ఉన్నతాధికారులతో మంగళవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
గదుల కేటాయింపు, దివ్యదర్శనంలో తీసుకు వచ్చిన మార్పులపై చర్చించారు. యాత్రికులకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారుల్ని అదేశించారు. సమావేశం అనంతరం జేఈవో మీడియాతో మాట్లాడుతూ... అలిపిరి కాలినడక మార్గంలో 14 వేలు, శ్రీవారి మెట్టు మార్గంలో 6 వేల దివ్యదర్శనం టోకెన్లను జారీ చేస్తున్నట్టు తెలిపారు.
ఇకపై వారాంతాలలో కాలినడక భక్తులకు టోక్కెన్ల జారీని కొనసాగిస్తామన్నారు. టైమ్స్లాట్ విధానంతో నడకదారిన వచ్చే భక్తులకు త్వరగా దర్శనం సౌకర్యం కల్పించనున్నట్టు ఆయన వివరించారు. గదుల కేటాయింపులో ఇటీవల తీసుకు వచ్చిన విధానం భక్తులకెంతో మేలు చేకూరుస్తుందన్నారు.
ముందువచ్చిన భక్తులకు ప్రాధాన్యత కల్పిస్తూ టోకెన్ల పద్దతిలో అద్దె గదులు కేటాయిస్తున్నామన్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మూత్సవాలు, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, పెరటాశి నెల ఇతర రద్దీ రోజులలో మినహా అన్ని రోజులలో (శుక్ర, శని, ఆదివారాలతో కలుపుకుని) కాలినడక భక్తులకు టోకెన్లు జారీ చేస్తామని తెలిపారు.
రూ.300/- ప్రత్యేక ప్రవేశదర్శనం, దివ్యదర్శనం కాంప్లెక్స్ల ద్వారా ఒక్క రోజుకు 40 వేల మంది భక్తులకు ప్రణాళికాబద్ధంగా శ్రీవారి దర్శనాన్ని కల్పిస్తున్నట్లు వివరించారు. ఒకవారానికి 1.40 లక్షల మంది భక్తులకు ప్రత్యేక ప్రవేశదర్శనం(రూ.300/-) కల్పించినట్లు తెలిపారు. భవిష్యత్తులో సర్వదర్శనం భక్తులకు స్లాట్ విధానం ద్వారా స్వామివారి దర్శనం కల్పించేందుకు సమాలోచనలు జరుపుతున్నామన్నారు.