ప్రధాని మోదీ టాప్ ప్రయారిటీ: పవన్ కల్యాణ్ ఫస్ట్ - బీజేపీ నేతలు నెక్స్ట్ - కీలక హామీ..!!
విశాఖపట్నం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన విశాఖపట్నం పర్యటన ప్రారంభమైంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, భారతీయ జనతా పార్టీతో జనసేన పొత్తు వ్యవహారాలు.. వంటి అంశాల మధ్య విశాఖపట్నానికి రాబోతోండటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. అదే సమయంలో- ప్రధానితో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ కాబోతోండటం అందరి దృష్టినీ తన వైపునకు తిప్పుకొంది.

ఆలస్యంగా మోదీ పర్యటన..
మోదీ పర్యటన కొంత ఆలస్యంగా ప్రారంభమైంది. తమిళనాడులోని మధురై నుంచి విశాఖకు బయలుదేరాల్సిన ప్రత్యేక విమానం- వాతావరణం అనుకూలించకపోవడంతో ఆలస్యంగా బయలుదేరింది. ప్రస్తుతం తమిళనాడు దక్షిణ ప్రాంతం, పుదుచ్చేరిల్లో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. విమానం టేకాఫ్ తీసుకోవడానికి అనుకూల వాతావరణం లేకపోవడం వల్ల ఈ జాప్యం ఏర్పడింది.

రోడ్ షోలో..
రాత్రి 8:15 నిమిషాలకు ప్రధాని మోదీ ప్రత్యేక విమానంలో విశాఖపట్నానికి చేరుకున్నారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు సాదర స్వాగతం పలికారు. అనంతరం విశాఖ మారుతి సెంటర్ నుంచి రోడ్ షోగా ప్రధాని మోదీ ఐఎన్ఎస్ చోళకు బయలుదేరి వెళ్లారు. ఒకటిన్నర కిలోమీటర్ పాటు ఆయన రోడ్ షో సాగింది. ఈ సందర్భంగా వందలాదిమంది విశాఖవాసులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. రోడ్డుకు ఒక పక్కన నిల్చుని మోదీకి జైకొట్టారు. కటౌట్లను ప్రదర్శించారు.

పవన్తో భేటీ..
ఐఎన్ఎస్ చోళకు చేరుకున్న వెంటనే ప్రధాని మోదీని పవన్ కల్యాణ్ కలుసుకున్నారు. భారతీయ జనత పార్టీ రాష్ట్రశాఖ నాయకుల కంటే ముందే పవన్ కల్యాణ్కు అపాయింట్ ఇచ్చారు మోదీ. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు ఈ సందర్భంగా వారిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసి పని చేయాల్సి ఉంటుందనే విషయం ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. పవన్ కల్యాణ్కు మోదీ కీలక హామీ ఇచ్చారనే ప్రచారం సాగుతోంది.

కోర్ కమిటీతో..
తన పర్యటన ఆలస్యంగా ప్రారంభమైన నేపథ్యంలో- మరింత జాప్యానికి అవకాశం ఇవ్వలేదాయన. వచ్చీరాగానే తన తన తదుపరి సమావేశాలను చేపట్టారు. ముందుగా పవన్ కల్యాణ్తో భేటీ అయ్యారు. ఏకాంతంగా సమావేశం అయ్యారు. అనంతరం బీజేపీ కోర్ కమిటీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సమావేశం ఇంకా కొనసాగుతోంది.

పలు ప్రాజెక్టులు..
10,500 కోట్ల రూపాయల విలువ చేసే పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడానికి, మరి కొన్నింటికి శంకుస్థాపన చేయడానికి ప్రధాని మోదీ విశాఖకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మధ్యామ్నం బెంగళూరు, సాయంత్రం తమిళనాడులో పర్యటించిన అనంతరం ఆయన విశాఖకు చేరుకున్నారు. విజయవాడ-గుడివాడ-భీమవరం-నిడదవోలు, గుడివాడ-మచిలీపట్నం-భీమవరం-నర్సాపురం మధ్య 221 కిలోమీటర్ల మేర డబ్లింగ్, విద్యుదీకరణ పూర్తిచేసుకున్న రైలు మార్గాన్ని ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు.

రైల్వే పనులకూ..
2,917 కోట్ల రూపాయలతో ఓఎన్జీసి ఈస్టర్న్ షోర్లో అభివృద్ధి చేసిన యూ-ఫీల్డ్ను అందుబాటులోకి తీసుకొస్తారు. 211 కోట్ల రూపాయలతో పాతపట్నం-నరసన్న పేటలను కలుపుతూ నిర్మించిన జాతీయ రహదారిని ప్రారంభిస్తారు మోదీ. 460 కోట్ల రూపాయలతో తలపెట్టిన విశాఖ రైల్వే స్టేషన్ ఆధునీకీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 3,778 కోట్ల రూపాయల వ్యయంతో తలపెట్టిన రాయ్పూర్ - విశాఖ ఆరు లేన్ల గ్రీన్ ఫీల్డ్ కారిడార్ నిర్మాణానికీ భూమిపూజ చేస్తారాయన.












Click it and Unblock the Notifications