ఆమె 17, అతను 16.. సహజీవనంలో ఇద్దరు: ఉన్నట్టుండి కథ అడ్డం తిరిగింది..
చిత్తూరు: ఆమె వయసు 17. అతను 16. ఇద్దరూ సహజీవనం చేశారు. పెద్దలకూ తెలిసింది. కొన్నాళ్ల తర్వాత పెళ్లి కూడా చేయాలనుకున్నారు. కానీ ఇంతలోనే అబ్బాయి మాట మార్చాడు. ఆమె తనకు వద్దన్నాడు. మనస్తాపం చెందిన ఆమె ఆత్మహత్యకు యత్నించింది. ఆమె తండ్రి కేసు పెట్టడానికి వెళ్తే.. మైనర్పై కేసు పెట్టాలా? వద్దా? అని పోలీసులు తల పట్టుకున్నారు.
అక్కకు తోడుగా ఉంటుందని పంపిస్తే..:
బీఎన్ కండ్రిగ సమీపంలోని గాజులపెళ్లూరుకు చెందిన ఓ కుటుంబం జీవనోపాధి రీత్యా చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండలానికి వలస వచ్చి స్థిరపడింది. వీరి పెద్ద కుమార్తెకు వివాహమై తమిళనాడులోని అత్తగారింట్లో ఉంటోంది. కొన్నాళ్ల క్రితం ఆమె గర్భం దాల్చడంతో.. ఆమెకు తోడుగా ఉంటుందని రెండో కుమార్తె(17)ను అక్కడికి పంపించారు తల్లిదండ్రులు.
శారీరకంగా దగ్గరయ్యారు..:
అక్క దగ్గరికి వెళ్లిన బాలిక.. స్థానికంగా ఉండే ఓ యువకుడి(16)తో ప్రేమలో పడింది. పెళ్లి కూడా చేసుకుందామని ఇద్దరూ నిశ్చయించుకున్నారు. ఆపై శారీరకంగానూ కలిశారు. విషయం రెండు కుటుంబాల్లో పెద్దలకు తెలిసి.. వాళ్లు కూడా ఒప్పుకున్నారు.
పెద్దల అంగీకారంతో సహజీవనం:
ఆ తర్వాత కొన్నాళ్లకు బాలిక తల్లిదండ్రుల వద్దకు వచ్చేసింది. దీంతో నేను కూడా ఆమెతో పాటే ఉంటానని బాలుడు కూడా వచ్చేశాడు. బాలిక తల్లిదండ్రులు అతని మాట కాదనలేదు. దీంతో ఇద్దరి మధ్య కొన్నాళ్లు సహజీవనం సాగింది.
మాట మార్చేశాడు:
కానీ ఇంతలోనే ఏమైందో ఏమో.. ఆ బాలుడు ఆమెను పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పాడు. దీంతో బాలిక ఆత్మహత్యకు యత్నించి ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటోంది. దీనిపై బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇద్దరూ మైనర్లే కావడంతో తొలుత కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆపై బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడానికి అనుమతి ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు.