మంత్రి కామినేని,ఎమ్మెల్యేలను అడ్డుకున్న పోలీసులు
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావుని, మరో నలుగురు ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్న గటన కలకలం సృష్టించింది.
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావుని, మరో నలుగురు ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్న ఘటన కలకలం సృష్టించింది. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు మంత్రి కామినేని తన వాహనంలో వెళుతుండగా కరకట్ట వద్ద ఆయన వాహనాన్ని పోలీసులు అడ్డుకొన్నారు. మంత్రి కామినేని వాహనంలో ఉన్నారని, అసెంబ్లీ సమావేశాల కోసం వెళుతున్నారని, ఎందుకు అడ్డుకుంటున్నారని మంత్రి గన్ మెన్ లు ప్రశ్నించగా పోలీసులు వాగ్వాదానికి దిగారే తప్ప ఎందుకు ఆపుతున్నారో చెప్పలేదు. ముందుకు వెళ్లడానికి అనుమతించేది లేదని మాత్రం స్పష్టం చేశారు. చుట్టూ తిరిగి వెళ్లాలంటే చాలా ఆలస్యం అవుతుందని తమని ఇటే పోనివ్వాలని సుమారు అరగంట పాటు మంత్రి కామినేని, ఇతర ఎమ్మెల్యేలు రోడ్డుపై ఎదురుచూస్తూ గడిపారు.
చివరకు పోలీసులు అది ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉన్న ప్రాంతం కావడంతో భద్రతా కారణాల దృష్ట్యా అటుగా వెళ్లేందుకు అంగీకరించేది లేదని మంత్రైనా, ఎమ్మెల్యేలైనా కరకట్ట రోడ్డు మార్గంలో అసెంబ్లీకి వెళ్లేందుకు లేదని తేల్చి చెప్పారు. అయితే ఈ విషయమై మంత్రి ,ఎమ్మెల్యేలు స్పీకర్ కోడెలకు సమాచారం ఇవ్వగా ఆయన పోలీసులపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. కరకట్ట రోడ్డుపై మంత్రులు, ఎమ్మెల్యేల వాహనాలను పోలీసులు అడ్డుకోవడంపై తనకు వివరణ ఇవ్వాలని పోలీసులను ఆదేశించారు. దీంతో గుంటూరు రూరల్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు అసెంబ్లీకి వచ్చి స్పీకర్కు వివరణ ఇచ్చారు. పోలీసుల తీరుపై స్పీకర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇలాంటి ఘటనలు పునరావృతం కారాదని హెచ్చరించినట్లు సమాచారం.