వైసీపీకి షాక్: శిల్పా అనుచరుడి ఇంటిపై పోలీసుల దాడి, రూ.7లక్షలు స్వాధీనం
అనుచరుడి ఇంటిపై సోదాల విషయం తెలియగానే.. నంద్యాల చైర్ పర్సన్ సులోచన, శిల్పా వర్గీయులు టూ టౌన్ పోలీసు స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు.
నంద్యాల: అధికార, ప్రతిపక్ష పార్టీలకు సవాల్గా నిలిచిన నంద్యాల ఉపఎన్నికలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. శిల్పామోహన్ రెడ్డి ఇచ్చిన షాక్ తో కాస్త ఢీలా పడ్డట్లు కనిపిస్తున్న టీడీపీ.. వైసీపీ గెలుపు ప్రయత్నాలకు ఎలాగైనా చెక్ పెట్టాలని చూస్తోంది.
వైసీపీలో చేరిన మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి
ఈ నేపథ్యంలోనే శిల్పామోహన్ రెడ్డి అనుచరుల ఇళ్లపై పోలీసులు దాడులు చోటు చేయడంతో.. ఇదంతా అధికార పార్టీ కుట్రే అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కాగా, మంగళవారం ఉదయం శిల్పామోహన్ రెడ్డి అనుచరుడు, స్థానిక కౌన్సిలర్ సుబ్బారాయుడి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. రూ.7లక్షల సొమ్మును స్వాధీనం చేసుకుని లెక్కా పత్రం లేదని తేల్చారు.
అనుచరుడి ఇంటిపై సోదాల విషయం తెలియగానే.. నంద్యాల చైర్ పర్సన్ సులోచన, శిల్పా వర్గీయులు టూ టౌన్ పోలీసు స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. ఓటమి భయంతోనే టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని వారు ఆరోపిస్తున్నారు.
శిల్పా అనుచరుల ఇళ్లపై దాడులతో టీడీపీ వైసీపీకి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసినట్లయిందని చెబుతున్నారు. ఈ దాడులు ఇలాగే కొనసాగితే.. నంద్యాల ఉపఎన్నిక రాజకీయాలు మరో మలుపు తిరగే అవకాశం లేకపోలేదు.