అమరావతి పాదయాత్రలో రైతుకు గుండెపోటు-సీపీఆర్ చేసి బతికించిన పోలీసులు
ఏపీలో అమరావతి రాజధాని కోరుతూ అరసవిల్లికి రైతులు చేస్తున్న పాదయాత్రలో ఇవాళ ఓ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటివరకూ రైతుల పాదయాత్రను పోలీసులు అడ్డుకుంటున్నారన్న విమర్శలు మాత్రమే వినిపిస్తుండగా.. ఇవాళ అదే పోలీసులు ఓ రైతు ప్రాణం కాపాడి శభాష్ అనిపించుకున్నారు.
అమరావతి పాదయాత్ర రాజమండ్రిలో కొనసాగుతున్న నేపథ్యంలో ఇందులో పాల్గొంటున్న ఓ రైతు అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో పాదయాత్రలో ఉన్న మిగిలిన రైతులు కంగారు పడ్డారు. వెంటనే ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో అక్కడే విధి నిర్వహణలో ఉన్న పోలీసులు స్పందించారు. సీపీఆర్ చేసి ఆ రైతు ప్రాణం కాపాడి శభాష్ అనిపించుకున్నారు. తద్వారా పోలీసులపై సాధారణంగా ఉండే అభిప్రాయాన్ని ఒక్కసారిగా మార్చి చూపించారు.
రైతుకు గుండెపోటు విషయం తెలియగానే అక్కడే ఉన్న ఎస్సై, కానిస్టేబుళ్లు ఒక్కసారిగా పరుగులు తీశారు. వెంటనే అంబులెన్స్ వచ్చే పరిస్దితి లేదని గ్రహించారు. గుండెపోటుకు గురైన రైతును రోడ్డుపైనే పడుకోబెట్టారు. వెంటనే తమకు తెలిసిన సీపీఆర్ విధానంలో గుండెను ఒత్తడం మొదలుపెట్టారు. పోలీసులు ఒకరి తర్వాత ఒకరు స్పందించారు. దీంతో కాసేపటికే ఆ రైతు ప్రాణం లేచి వచ్చింది. దీన్ని చూసిన అమరావతి రైతులంతా ఒక్కసారిగా హర్షధ్వానాలు చేశారు. రైతు ప్రాణం కాపాడిన పోలీసులను ప్రశంసలతో ముంచెత్తారు.