అన్నయ్యతో రాజకీయంగా వేరు: పవన్ కళ్యాణ్, రాజధానికి వెళ్లాలనే ఉంది కానీ
హైదరాబాద్: అన్నయ్య చిరంజీవి, తన రాజకీయ విధానాలు వేరు అయినప్పటికీ సినిమా పరంగా అన్నయ్య అంటే తనకు గౌరవం అని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు చెప్పారు. పవన్ ఆదివారం సాయంత్రం చిరంజీవి ఇంటికి వెళ్లారు.
చిరు తనయుడు, బ్రూస్ లీ హీరో రామ్ చరణ్ తేజ బాబాయ్ పవన్ కళ్యాణ్ను ఇంటిలోకి ఆహ్వానించారు. చిరంజీవితో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. అన్నయ్యకు పుష్పగుచ్ఛం ఇచ్చారు. అనంతరం చాలా రోజుల తర్వాత బ్రూస్ లీ చిత్రంలో నటించినందుకు అభినందనలు తెలిపారు.
అనంతరం విలేకరులతో మాట్లాడారు. తాను సినిమాల్లోకి రావడానికి, తనకు జీవితం కారణం చిరంజీవేనని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లోకి వచ్చాక అన్నయ్యను చాలాసార్లు కలిశానని, ప్రత్యేకంగా కలవలేదని చెప్పారు. పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ నుంచి అదే గెటప్లో అన్నయ్య వద్దకు వెళ్లారు.
ఆయనను అభిమానించే వారందరీ తరఫున ఆయనను కలిశానని పవన్ కళ్యాణ్ చెప్పారు. నేను నిర్మాతగా చరణ్ సినిమాకు రెండు మూడు కథలు పరిశీలించామన్నారు. సినిమా పరంగా మేమంతా ఒక్కటేనని చెప్పారు. సర్దార్ గబ్బర్ సింగ్ సంక్రాంతికి విడుదల అనుకున్నామని తెలిపారు. కానీ ఎంత వరకు సాధ్యమో అన్నారు.
అమరావతి శంకుస్థాపన వేడుకకు వెళ్లడంపై...
ఆంధ్రప్రదేశ్ రాజధాని శంకుస్థాపనకు తనకు వెళ్లాలని ఉన్నప్పటికీ.. సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ ఉన్నందు వల్ల చెప్పలేకపోతున్నామని చెప్పారు. తనకు అమరావతి శంకుస్థాపనకు వెళ్లాలనే ఉందని చెప్పారు. అయితే తన షూటింగ్ పరిస్థితిని బట్టి చూడాల్సి ఉంటుందన్నారు.