పొలిటికల్ హీట్: సాయిరెడ్డి వర్సెస్ కన్నా: నువ్వు మగాడివైతే..అంటూ సవాల్: పరువు నష్టం దావా వేస్తా
అమరావతి: కరోనా వైరస్ కమ్మేస్తోన్న వేళ.. రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది. కరోనా వైరస్ను నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలు దీనికి కేంద్రబిందువుగా మారుతున్నాయి. కరోనా వైరస్ పేషెంట్లను గుర్తించడానికి జగన్ సర్కార్ దక్షిణ కొరియా నుంచి తెప్పించిన కిట్ల రేట్లపై తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్గా చేసుకున్నాయి. ఆయా పార్టీల నాయకుల మధ్య ట్వీట్ల వార్కు తెర తీశాయి.
బీజేపీ వర్సెస్ వైసీపీ
కరోనా వైరస్ కిట్ల రేట్ల విషయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడ్డారంటూ టీడీపీ, బీజేపీ నాయకులు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఛత్తీస్గఢ్తో పోల్చుకుంటే ఒక్కో కిట్పై అదనంగా 500 రూపాయలను అదనంగా ఖర్చు చేసిందటూ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఇతర నాయకులు చేసిన వ్యాఖ్యలను తిప్పి కొట్టే బాధ్యతను వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి తీసుకున్నారు.
చంద్రబాబు అద్దె మైకుగా కన్నా..
బీజేపీ నేతల ఆరోపణలను ఆయన తిప్పి కొడుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నుంచి కన్నా లక్ష్మీనారాయణకు 20 కోట్ల రూపాయలను ముడుపులను తీసుకున్నారని ఆరోపించారు. 20 కోట్ల రూపాయలను తీసుకుని కన్నా లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని అన్నారు. కరోనా వైరస్ కిట్లకు సంబంధించిన రేట్ల విషయంలో కన్నా లక్ష్మీనారాయణ దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.
ప్రెస్మీట్ పెట్టి మరీ.. దులిపేసిన
సాయిరెడ్డి ఆరోపణలను తిప్పి కొట్టడానికి కన్నా లక్ష్మీనారాయణ సోమవారం ఉదయం గుంటూరులోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దక్షిణ కొరియా నుంచి కొనుగోలు చేసిన కిట్ల ధరల విషయంలో ప్రభుత్వ అధికారులు ఒక్కొక్కరు ఒక్కో రేటు చెబుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం అత్యధిక రేటు పెట్టి వాటిని కొనుగోలు చేసిందనే విషయాన్ని పరోక్షంగా ఒప్పుకొంటున్నారని అన్నారు.
భుజాలెందుకు తడుముకొంటున్నారు..
వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి ఒక రేటు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియా గ్రూపు ఒక రేటు, ఆరోగ్య ఆంధ్ర విభాగం ఇంకో రేటు చెబుతున్నారని విమర్శించారు. నామినేషన్ ప్రాతిపదికన ఎందుకు తెప్పించుకోవాల్సి వచ్చిందని కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. గుమ్మడికాయల దొంగ అంటే సాయిరెడ్డి ఎందుకు భుజాలు తడుముకొంటున్నారని నిలదీశారు.
Recommended Video
నన్నెవరూ కొనలేరు..
సమాంతర రాజకీయాల్లో తనను కొనే దమ్ము ఎవరికీ లేదని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. దమ్ముంటే.. మగాడివైతే ఇద్దరం కలిసి కాణిపాకం ఆలయానికి వెళ్లి, తనతో కలిసి ప్రమాణం చేసే ధైర్యం ఉందా? ఆయన విజయసాయి రెడ్డికి సవాల్ విసిరారు. అలా రాకపోతే.. తప్పు చేసినట్టేనని ఒప్పుకోవాలని చెప్పారు. పిచ్చి, పిచ్చి మాటలు మాట్లాడవద్దని, ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని అన్నారు. అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదని, విజయసాయి రెడ్డిలాంటి వాళ్లను తాను చాలామందిని చూశానని చెప్పారు. సూట్కేసు కేసుల కింద సాయిరెడ్డి జైలుకు వెళ్లొచ్చారని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. తనపై చేసిన ఆరోపణలపై తాను పరువునష్టం దావా వేయబోతున్నానని చెప్పారు.