"జాగ్రత్తపడండి".. జగన్ మాటలకు అర్ధమేంటి ? ఇదేనంటున్న వైసీపీ, టీడీపీ !
ఏపీలో వైసీపీ ప్రభుత్వం మూడున్నరేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఎలాగో ఉంటుంది. దీన్ని అధిగమించేందుకు ఓవైపు సీరియస్ గా ప్రయత్నిస్తున్న సీఎం జగన్.. గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో అందరూ పాల్గొనాలని వైసీపీ నేతలకు టార్గెట్లు పెట్టేశారు. ఇదే క్రమంలో తాజాగా జరిగిన మంత్రివర్గ భేటీలో సైతం మంత్రులకు జగన్ ఓ సూచన లాంటి హెచ్చరిక చేశారు. దీని సారాంశం "జాగ్రత్తగా ఉండండి"..మరి దీని అర్ధమేంటి.. ఇప్పుడు వైసీపీ, టీడీపీ మధ్య దీనిపైనే వార్ సాగుతోంది.
కేబినెట్లో మంత్రులతో జగన్
తాజాగా జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. వీటిపై పలు నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఆ తర్వాత చివర్లో మంత్రులతో సీఎం జగన్ ప్రత్యేకంగా మాట్లాడారు. ఇందులో
మంత్రులకు సీఎం జగన్ సుతిమెత్తగా హెచ్చరికలు చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రత్యేకంగా ఓ పదాన్ని వాడారు. అది "జాగ్రత్తగా ఉండండి". దీనర్ధం ఏంటో జగన్ కు, అక్కడున్న మంత్రులకు బాగానే తెలుసు. కానీ దీనిపై పత్రికల్లో వచ్చిన వార్తలు, మీడియాలో కనిపించిన కథనాలు వైసీపీని ఇరిటేట్ చేశాయి. దీంతో వైసీపీ నేత సజ్జల దీనిపై ఘాటుగా స్పందించారు. దీంతో టీడీపీ కూడా దానికి కౌంటర్లు ఇచ్చే పనిలో పడింది. ఫైనల్ గా జగన్ తన మంత్రులకు చేసిన సూచన టీడీపీ వర్సెస్ వైసీపీ పొలిటికల్ వార్ గా మారిపోయింది.
ఎల్లోమీడియా రాతలపై సజ్జల ఫైర్
కేబినెట్ భేటీలో సీఎం జగన్ మంత్రులకు చేసిన సూచనపై ఎల్లో మీడియాలో వచ్చిన వార్తలపై వైసీపీ మండిపడుతోంది. దీనిపై స్పందించిన పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి... మంత్రులను జాగ్రత్తగా ఉండాలని మాత్రమే సీఎం క్యాబినెట్ భేటీలో చెప్పారన్నారు. కానీ దీనిపై బరితెగింపు, అడ్డగోలుగా కొన్ని రాతలు రాస్తున్నారని ఆక్రోశం వెళ్లగక్కారు. జగన్ ను అసలు ఏమి చేయనిచ్చారు....మాకేమైనా జన్మభూమి కమిటీలు ఉన్నాయా అంటూ సజ్జల ప్రశ్నించారు. మా ప్రభుత్వంలో అన్ని విధానాలు చాలా పారదర్శకంగా ఉన్నాయని పేర్కొన్నారు. అభూతాకల్పనలు, లేనివి ఉన్నట్టు చూపుతున్నారంటూ మీడియాపై సజ్జల ఫైర్ అయ్యారు.
జగన్ చెప్పిందిదే అన్న టీడీపీ !
జగన్ కేబినెట్ భేటీలో మంత్రులకు చేసిన సూచనలపై టీడీపీ నేత బోండా ఉమ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రులకు జగన్ దోచుకుంది చాలు ఇక జాగ్రత్తగా ఉండమని కేబినెట్లో చెప్పారంటూ ఇవాళ వ్యాఖ్యానించారు. మూడేళ్లలో లక్షల కోట్ల ప్రజాధనం దోచుకున్న జగన్ .. ఇవేవీ తెలియనట్లు మంత్రులకు మాత్రం జాగ్రత్తలు చెబుతున్నారని విమర్శించారు. జగన్ హయాంలో మంత్రులు, ప్రజా ప్రతినిధులు సహజసంపదను దోచుకున్నారని, ఎన్నికల నేపథ్యంలో ఇవన్నీ ఆపేసి జాగ్రత్త పడాలని జగన్ కేబినెట్లో చెప్పడం సిగ్గుచేటని టీడీపీ నేత బోండా విమర్శించారు.