టిడిపి మాట్లాడదేం, జగన్పార్టీ టి నేతలు శవాలే: పొన్నం
హైదరాబాద్: సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ నేతల వ్యాఖ్యలు తెలంగాణలోని ఆ పార్టీ నేతలకు వినిపించడం లేదా? అని కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ మంగళవారం ప్రశ్నించారు. సీమాంధ్ర నేతలు తెలంగాణను అడ్డుకునే ప్రయత్నాలు చేయవద్దన్నారు.
వారు తమ సమస్యలకు పరిష్కారం చూపించాలన్నారు. తెలంగాణను ఎవరు వ్యతిరేకించవద్దని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అప్రజాస్వామికంగా జరుగుతోందన్న సీమాంధ్ర టిడిపి నేతల వ్యాఖ్యల పైన తెలంగాణ టిడిపి నేతలు స్పందించాలని పొన్నం డిమాండ్ చేశారు.

తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేతలు ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రాంతంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు శవాలేనని విమర్శించారు. తెలంగాణను కొందరు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని నిజామాబాద్ ఎంపి మధుయాష్కీ అన్నారు.
రెండుసార్లు అధికారం కట్టబెడితే ఇలాగా?: జెపి
రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెసు పార్టీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని లోక్సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ వేరుగా విమర్శించారు. తెలుగు ప్రజల పట్ల కాంగ్రెసు పార్టీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందన్నారు. 1987 తర్వాత జరిగిన విభజనలలో స్థానిక ప్రజలను, శాసన సభను ఒప్పించే రాష్ట్రాలను విభజించారని గుర్తు చేశారు.
తెలుగు ప్రజలు ఓఠు వేసి రెండుసార్లు అధికారం కట్టబెడితే ఇచ్చే వరమిదా అన్నారు. ఓట్లు, సీట్ల కోసం సీమాంధ్రలో జగన్ పార్టీతో ఒప్పందం కుదుర్చుకొని నాటకాలాడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెసు పార్టీ రాష్ట్ర ప్రజలను బలిపశువులను చేస్తోందన్నారు. 2004లో అధికారం కోసం వైయస్ పునాది వేశారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications