ఠాణాలోనే డ్రామా, నిస్పృహతోనా..: అడ్డంగా దొరికిపోయాడు
ఒంగోలు: పోలీసు ఉన్నతాధికారి కావాలనే కలలు సాకారం కాకపోవడంతో ఓ యువకుడు అడ్డదారి తొక్కాడు. ఐపిఎస్గా ఎంపికయ్యాయని పోలీసు స్టేషన్లో సందడి చేశాడు. దాంతో అడ్డంగా దొరికిపోయాడు.
ఐపీఎస్ గా సెలెక్ట్ అయ్యానంటూ పోలీస్ స్టేషన్లోనే సందడి చేసి అడ్డంగా దొరికిపోయాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరులో చోటు చేసుకుంది. సీఐ వి.శ్రీరామ్ ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు అందించారు.
కడప జిల్లా కాశినాయన మండలం వడ్డెమాను గ్రామానికి చెందిన కర్నాటి గురువినోద్కుమార్రెడ్డి గిద్దలూరులో డిగ్రీ చదివాడు. ఆ తర్వాత హైదరాబాద్, ఢిల్లీలో కోచింగ్ తీసుకుని సివిల్స్ పరీక్షలకు హాజరయ్యాడు. అతని స్నేహితులు కొందరు సివిల్స్కు ఎంపికయ్యారు.
దాంతో అతను దారి తప్పి, ఐపిఎస్గా సెలెక్ట్ అయ్యాయని, ఈనెల 18 నుంచి హైదరాబాద్లోని పోలీసు అకాడమీలో 52వారాల పాటు శిక్షణ తీసుకోవాలని చెప్పి తనకున్న సాఫ్ట్వేర్ పరిజ్ఞానంతో నకిలీ ఉత్తర్వులు సృష్టించాడు.
ఇటీవల ఒక కేసు నిమిత్తం ఇటీవల గిద్దలూరు వచ్చిన వినోద్, ఎస్ఐ మల్లికార్జునను కలిశాడు. మాటల సందర్భంలో తాను ఐపీఎస్ గా సెలక్ట్ అయ్యాయని చెప్పి తనవారికి ఓ పనిచేసి పెట్టాలని కోరాడు.
2016 బ్యాచ్లో ర్యాంక్ పొందానని వినోద్ చెప్పడంతో అనుమానం వచ్చిన ఎస్ఐ వెంటనే సీఐకి సమాచారం అందించారు. గత రెండేళ్లలో సివిల్స్లో ఉత్తీర్ణులై, ఐపీఎస్ కు ఎంపికైనవారి జాబితాను వీరు పరిశీలించారు. అయితేఎక్కడా వినోద్ పేరు కనిపించలేదు. దీంతో శుక్రవారం వినోద్ను పోలీసులు అరెస్టు చేశారు.