జేసి కుటుంబమే టీడీపీకి సమస్య-ప్రభాకర్ చౌదరి ఫైర్ : ఒంటరవుతున్న బ్రదర్స్-అహంకారమంటూ..!!
అనంతపురంలో టీడీపీ నేతల అంతర్గత విభేదాలు మరోసారి బయటకు వచ్చాయి. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆధిపత్య పోరుతో ఒకరి పైన మరొకరు రాజకీయం చేసిన నేతలు..ఇప్పుడు మరలా అదే పంథా అనుసరిస్తున్నారు. టీడీపీ తమ పార్టీకి కంచుకోటగా భావించే అనంతపురం జిల్లాలో 2019 ఎన్నికల్లో జిల్లాలో రెండు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలిచింది. అందులో హిందూపూర్ నుంచి నందమూరి బాలక్రిష్ణ .. ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్ ఉన్నారు. ఆ ఇద్దరూ తమ నియోజకవర్గాలకే పరిమితం అయ్యారు.
అనంతలో టీడీపీ నేతల వర్గ విభేదాలు
ఇక, మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తంగా తాడిపత్రిలో మాత్రమే టీడీపీ గెలిచింది. జేసీ బ్రదర్స్ తమకు ఉన్న పట్టుతో అక్కడ ఛైర్మన్ సీటు దక్కించుకొని జేసీ ప్రభాకర రెడ్డి మున్సిపల్ ఛైర్మన్ అయ్యారు. ఇక, తాజాగా అనంతపురంలో రాయలసీమ ప్రాజెక్టుల భవిష్యత్తుపై మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు అధ్యక్షతన సీమ టీడీపీ ముఖ్య నేతల సదస్సు జరిగింది. ఈ సదస్సు సమయంలోనే జేసీ ప్రభాకర రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. జిల్లాలో కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని.. కార్యకర్తలను లోపల వేస్తుంటే ఎవరు వారికి మద్దతుగా నిలిచారంటూ ప్రశ్నించారు.
జేసీ బ్రదర్స్ వర్సెస్ టీడీపీ నేతలు
కాల్వ శ్రీనివాసులుతో పాటుగా మరో నేత జిల్లాలో పార్టీని నాశనం చేస్తున్నారని మండి పడ్డారు. రాజకీయ నిరుద్యోగులు ప్రాజెక్టు ల అంశాన్ని పట్టుకొని వెలేడాతారంటూ వ్యాఖ్యానించారు. సర్పంచ్ గా పోటీ చేసే అభ్యర్ధులకు ఎవరికైనా వీరు అండగా నిలబడ్డారా అంటూ ప్రశ్నించారు. జిల్లాలో పార్టీని నాశనం చేస్తున్నారంటూ తీవ్రంగా స్పందించారు. పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేసారు. అన్ని విషయాలు పార్టీ సమావేశంలో వెల్లడిస్తానని చెప్పారు.
చంద్రబాబు పైన జేసీ బ్రదర్స్ ఒత్తిడి
చంద్రబాబు ఒక నైనా మేల్కనాలంటూ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యల పైన తొలి నుంచి జేసీ బ్రదర్స్ ను వ్యతిరేకిస్తున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో మీరు చేసిన దౌర్జన్యాలకు వ్యతిరేకంగా జిల్లాలో పోరాటాలు చేశామని తెలిపారు. వ్యక్తిగతంగా కార్యకర్తలు లేరని చెప్పడం మీ అహంకారానికి నిదర్శనమన్నారు. మాజీమంత్రి కాలువ శ్రీనివాసులు వివాద రహితుడని చెప్పారు. జేసి కుటుంబమే టీడీపీకి సమస్య అని ప్రభాకర్ చౌదరి అన్నారు.
ప్రభాకర్ చౌదరి సంచలన వ్యాఖ్యలు
2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన జేసీ బ్రదర్స్ లో దివాకర్ రెడ్డి అనంతపురం ఎంపీగా గెలవగా.. ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పుడు జిల్లా పార్టీలో వారికి ఎవరి నుంచి మద్దతు లభించలేదు. ఇక, ఇప్పుడు టీడీపీ ప్రతిపక్షంలోకి వచ్చిన తరువాత ప్రభాకర్ రెడ్డి దాదాపుగా ఒంటరి వాడిగా కనిపిస్తున్నారు. పార్టీ నేతలు ఎవరూ ఆయన పైన కేసులు నమోదు చేసిన సమయంలో..ఇతర సందర్భాల్లో మద్దతుగా నిలబడలేదు.
చంద్రబాబుకు అనంత నేతలతో కొత్త సమస్యలు
దీంతో..ఎన్నికల నాటికి జిల్లాలోని టీడీపీ నేతలు వారితో కలిసి సాగుతారా లేక, జేసీ బ్రదర్స్ మరో రకమైన ఆలోచనలు చేస్తారా అనేది ఇప్పుడు అనంతపురం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో..మరి ఈ పరిస్థితిని చక్కదిద్దటానికి పార్టీ అధినేత చంద్రబాబు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.