హ్యాట్సాఫ్ .. యాచకుడి శవాన్ని రెండు కిలోమీటర్లు భుజంపై మోసి తెచ్చిన ప్రకాశం జిల్లా పోలీసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా పోలీసులు మానవత్వానికి పర్యాయపదంగా నిలిచారు. దట్టమైన అటవీ ప్రాంతం నుండి ఓ అనాధ శవాన్ని, భుజాలపై వేసుకొని రెండు కిలోమీటర్ల మేర మోసుకొచ్చి అందరిని ఆశ్చర్యపోయేలా చేశారు. సొంతవాళ్ళకే సహాయం చెయ్యాలంటే ఆలోచిస్తున్న నేటి రోజుల్లో ఎవరో తెలీని వ్యక్తి కోసం పోలీసులు తీసుకున్న నిర్ణయం వారిని మెచ్చుకునేలా చేసింది .
అటవీప్రాంతంలో మృతి చెందిన యాచకుడు , సంఘటనా స్థలానికి పోలీసులు
ప్రకాశం జిల్లా దోర్నాల మండలం మర్రిపాలం గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఒక యాచకుడు మరణించాడు. సుమారు 50 నుండి 60 సంవత్సరాల మధ్య వయసు గల ఒక యాచకుడు అక్కడ చనిపోయి ఉండడాన్ని గమనించిన సమీప మర్రిపాలం గ్రామానికి చెందిన వారు పోలీసులకు సమాచారం అందించారు.దీంతో పోలీసులు అటవీ ప్రాంతంలో ఘటన స్థలానికి చేరుకుని అక్కడ యాచకుడి మృతదేహాన్ని పరిశీలించారు.
యాచకుడి మృతదేహాన్ని రెండు కిలోమీటర్ల మేర మోసిన పోలీస్ కానిస్టేబుల్స్
అక్కడ నుండి సదరు మృతదేహాన్ని స్థానికుడి సహాయంతో హెడ్ కానిస్టేబుల్స్ ఒక కర్రకు మృతదేహాన్ని కట్టుకొని తమ భుజాల మీద రెండు కిలోమీటర్ల మేర మోసి గ్రామంలోకి తీసుకొచ్చారు .శవాన్ని గుర్తించే నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీలో ఉంచారు. విధి నిర్వహణలో మానవత్వంతో ప్రవర్తించిన దోర్నాల పోలీస్ స్టేషన్లో పనిచేసే సదరు హెడ్ కానిస్టేబుల్స్ ను పోలీసు ఉన్నతాధికారులు మరియు ప్రకాశం జిల్లా ప్రజలు సైతం అభినందించారు.
గతంలో శ్రీకాకుళం జిల్లాలో, వరంగల్ లోనూ మానవత్వం చాటిన పోలీసులు
గతంలో శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో వృద్ధుడైన ఒక అనాధ మృతదేహాన్ని స్థానిక మహిళా ఎస్సై శిరీష రెండు కిలోమీటర్ల మేర భుజాలపై వేసుకొని మోసుకుంటూ వచ్చి, లలిత చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులకు అప్పగించి అంత్యక్రియలు నిర్వహించేలా చేశారు. అప్పుడు ఎస్ఐ శిరీష చూపిన మానవత్వాన్ని డీజీపీ గౌతమ్ సవాంగ్ తో సహా, పలువురు కొనియాడారు.గతంలో వరంగల్ జిల్లా పోలీసులు కూడా ఇదే విధంగా తమ ఔదార్యం చాటారు.