సైలెంట్గా వ్యూహాన్ని అమలు చేసే పనిలో: పాదయాత్రలో పీకె టీమ్ 'ఆపరేషన్'..
సోషల్ మీడియాను ఇందుకు ప్రత్యామ్నాయంగా వాడుకోవాలని ప్రశాంత్ కిశోర్ భావిస్తున్నారు.
విజయవాడ: ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు.. ప్రజా సంకల్పయాత్ర.. 2019లో అధికారం కోసం ఏపీ ప్రతిపక్ష నేత జగన్ ఈ రెండింటి పైనే ఆధారపడ్డారు. అనుకున్నట్టుగానే ప్రజా సంకల్ప యాత్రను ఘనంగా ప్రారంభించిన జగన్.. తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని మరిపించేందుకు తీవ్రంగానే శ్రమిస్తున్నారు.
గతంలో వైఎస్ అందించిన పాలనను, ఇప్పటి పాలనను ప్రజల ముందు ఏకరువుపెడుతూ.. మళ్లీ రాజన్న రాజ్యం తీసుకొస్తానన్న నమ్మకంతో కదులుతున్నాడు. జగన్ నమ్మకం ఎంతమేర నిజమవుతుందో తెలియదు గానీ.. ఆయన గెలుపు కోసం ప్రశాంత్ కిశోర్ టీమ్ ప్రజా సంకల్పయాత్రలో బాగానే శ్రమిస్తోంది. పీకె సైలెంట్గా తన వ్యూహాలను అమలు చేసే పనిలో నిమగ్నమయ్యారు.
పాదయాత్రలో పీకె టీమ్:
జగన్ ప్రజాసంకల్ప యాత్రను కవర్ చేసేందుకు కొంతమంది యువతీ యువకులతో కూడిన టీమ్ను ప్రశాంత్ కిశోర్ ప్రత్యేకంగా నియమించారు. ప్రజాసంకల్ప యాత్రలో కొన్నిచోట్ల వీరే సెంటరాఫ్ ఎట్రాక్షన్గా నిలిచినట్టు చెబుతున్నారు. బ్లాక్&బ్లూ డ్రెస్లో చేతిలో మొబైల్ కెమెరాలతో హల్ చల్ చేస్తూ కనిపిస్తున్నారు. కొంతమంది పాదయాత్ర వాహనంపై నుంచి వీడియోలు చిత్రీకరిస్తుండగా.. మరికొంతమంది జనంలోకి వీడియోలు చిత్రీకరిస్తున్నారు.
పాదయాత్ర కవరేజ్:
కేవలం జగన్ ప్రసంగాలనే కాకుండా జనంలోకి వెళ్లి కూడా వీరు వీడియో కవర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో జగన్ మైలేజ్ పెంచే క్రమంలో భాగంగా.. ప్రత్యేక వీడియోలు, పాటలు రూపొందించడం కోసమే ఈ వీడియోలు చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది. టీమ్ తో పాటు ప్రశాంత్ కిశోర్ కూడా యాత్రను పర్యవేక్షిస్తున్నట్టు సమాచారం.
ఆత్మవిశ్వాసం నింపుతూ:
ఇప్పటిదాకా ప్రచారంలో ఉన్న పార్టీ బలహీనతలన్నింటికీ పాదయాత్రతోనే చెక్ చెప్పాలన్న భావనలో జగన్ ఉన్నారు. క్షేత్రస్థాయిలో వైసీపీ నాయకుల్లో ఆత్మవిశ్వాసం నింపడంతో పాటు ప్రజల్లో ఆదరణ పెంచుకోవాలని భావిస్తున్నారు. గత వైఎస్ పాలనను మళ్లీ తీసుకొస్తానని ప్రజలకు హామి ఇస్తున్నారు. అదే సమయంలో ప్రజా సంకల్ప యాత్ర తీరు తెన్నుల గురించి ప్రశాంత్ కిశోర్ సలహాలు, సూచనలను పాటిస్తూ ఆయన ముందుకెళ్లే అవకాశం ఉంది.
సోషల్ మీడియా:
రాష్ట్రంలో జగన్ ప్రత్యర్థి మీడియా ప్రభావం ఎక్కువగా ఉండటంతో.. జగన్ పాదయాత్ర కేవలం సాక్షి టీవిలోనే ఎక్కువ ప్రసారం అవుతోంది. దీంతో సోషల్ మీడియాను ఇందుకు ప్రత్యామ్నాయంగా వాడుకోవాలని ప్రశాంత్ కిశోర్ భావిస్తున్నారు. యువతను, నెటిజెన్లను ఆకర్షించడానికి.. పాదయాత్రకు సంబంధించి అద్భుతమైన విజువల్స్ తయారుచేసే పనిలో వీరు నిమగ్నమైనట్టు సమాచారం. ఒకవిధంగా సోషల్ మీడియా క్యాంపెయినింగ్ లో ట్రెండ్ సెట్ చేసే దిశగా వీరు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.