వైసిపి నేతలపై పరువు నష్టం: పత్తిపాటి, చంద్రబాబును కలిసిన కేజ్రీవాల్
గుంటూరు: తన పైన ఆరోపణలు చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన తాను పరువు నష్టం దావా వేస్తానని ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లారావు బుధవారం నాడు చెప్పారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకల్లోని లక్షలాది మందిని అగ్రిగోల్డ్ ముంచిన విషయం తెలిసిందే.
అగ్రిగోల్డ్ అంశం ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉంది. అయితే, అగ్రిగోల్డ్ ఆస్తులను మంత్రి పత్తిపాటి చవకగా కొనుగోలు చేశారని వైసిపి నేతలు ఇటీవల ఆరోపించారు. తన భార్య పేరిట మంత్రి పత్తిపాటి అగ్రిగోల్డ్ ఆస్తులను కొనుగోలు చేశారని, ఈ కారణంగా మంత్రిని వెంటనే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
దీని పైన పత్తిపాటి పుల్లారావు భగ్గుమన్నారు. అగ్రిగోల్డ్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులను తాను కొనుగోలు చేయలేదన్నారు. తన పైన అసత్య ఆరోపణలు చేసిన వైసీపీ నేతలపై పరువు నష్టం దావా వేస్తానన్నారు.
పండుగ వాతావరణం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మన మట్టి మన నీరు కార్యక్రమంతో రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో పండుగ వాతావరణం నెలకొందని పత్తిపాటి చెప్పారు.
ఆయన చిలకలూరిపేటలోని గంగాపార్వతీ సమేత నాగేశ్వరస్వామి ఆలయం, పెద్ద మసీదు, నాగన్నపాలెం చర్చిలలో సేకరించిన మట్టిని, నీటికి పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. పార్టీలకు, కులమతాలకు అంతీతంగా ప్రతి ఒక్కరు రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు.
చంద్రబాబును కలిసిన కేజ్రీవాల్
దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కలిశారు. అమరావతి శంకుస్థాపన వేడుకకను ఏపీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించనున్న విషయం తెలిసిందే.
ఏపీ రాజధాని శంకుస్థాపన ఏర్పాటుకు కమిటీలు
రాజధాని శంకుస్థాపన ఏర్పాట్లకు కమిటీలను నియమించారు. స్వాగత కమిటీలో మంత్రులు గంటా శ్రీనివాస రావు, రావెల కిషోర్, దేవినేని ఉమామహేశ్వర రావు, కామినేని శ్రీనివాసులు ఉన్నారు. ఆతిథ్య కమిటీలో మంత్రులు మణాళిని, పరిటాల సునీత, పీతల సుజాతలు ఉన్నారు.
రాష్ట్రస్థాయి ఉత్సవాల కమిటీలో మంత్రులు మాణిక్యాల రావు, అయ్యన్నపాత్రుడు, మీడియా కమిటీలో మంత్రులు పల్లె రఘునాథ్ రెడ్డి, బొజ్జల గోపాల కృష్ణ రెడ్డిలు, రాజధాని వేదిక కమిటిల డిప్యూటీ సీఎం కెఈ కృష్ణమూర్తి, పత్తిపాటి పుల్లారావులు ఉన్నారు.
నిర్వహణ కమిటీలో యనమల రామకృష్ణుడు, పి నారాయణ, ఆహ్వాన కమిటీలో అయ్యన్నపాత్రుడు, కామినేని శ్రీనివాస రావులు సభ్యులుగా ఉంటారు. ప్రతి కమిటీలో సీఆర్డీఏ, మున్సిపల్, ప్రోటోకాల్ అధికారులు సహా కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు ఉంటారు.