ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు జగన్ దసరా ధమాకా కానుక - ఇచ్చేశారుగా..!!
అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అద్దిరిపోయే దసరా కానుకను ప్రకటించారు. వేలాదిమంది ఉద్యోగుల కలను సాకారం చేశారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఆర్టీసీ ఉద్యోగులు ఇక అధికారికంగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందనున్నారు. పీఆర్సీ కలిపిన కొత్త జీతాలను వారు అందుకోబోతోన్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేస్తోన్నారు.
ప్రమోషన్ తీసుకున్న 2,094 మందికి మినహా మిగిలిన వారందరికీ అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త వేతనాలు అందుతాయి. పదోన్నతి పొందిన వారికి నవంబర్ 1వ తేదీ నుంచి పీఆర్సీతో కూడిన వేతనాలు చెల్లిస్తుంది ప్రభుత్వం. పీఆర్సీ అమలు చేయడం వల్ల ఒక్కో ఉద్యోగి జీతంలో కనీసం 3,000 నుంచి 6,000 రూపాయలు పెరుగుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఏపీఎస్ఆర్టీసీలో పని చేస్తోన్న సుమారు 52 వేల మందికి పైగా ఉద్యోగులకు లబ్ది కలుగుతుంది.
కొత్త పీఆర్సీని అమలును ప్రకటించిన నేపథ్యంలో- ఏపీ ప్రజా రవాణా శాఖ వైఎస్సార్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ను కలిశారు. కృతజ్ఞతలు తెలిపారు. తొలిసారిగా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తాము కూడా జీతాలు అందుకోబోతోండటం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. పాదయాత్రలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశామని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన సేవలను అందించడంలో రాజీపడొద్దని, సంస్థను లాభాలబాట పట్టించాలని సూచించారు.
ఇదివరకే ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వేతన సవరణ ప్రకటించినప్పటికీ- దాన్ని అమలు చేయడంలో జాప్యం ఏర్పడటంతో వారు ఆందోళనకు గురయ్యారు. అదే సమయంలో డీజిల్ రేటు భారీగా పెరిగిపోవడం, చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా లీటర్ 100 రూపాయలను దాటిన పరిస్థితి ఏర్పడటం, బస్సుల నిర్వహణ వంటి కారణాలతో పీఆర్సీని అమలు చేయడం ఆలస్యమైంది. ఈ అదనపు ఆర్థిక భారం వల్ల ఆర్టీసీ ఉద్యోగులకు సకాలంలో పీఆర్సీని ఇవ్వలేకపోయామని అధికారులు చెబుతున్నారు.
ఇప్పుడు కూడా ఆ పరిస్థితులే ఉన్నప్పటికీ- ఉద్యోగుల డిమాండ్, వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పీఆర్సీ అమలుకు సిద్ధపడ్డామని స్పష్టం చేస్తోన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన మరుసటి సంవత్సరమే అంటే 2020 జనవరి 1వ తేదీ నుంచి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తోన్నట్లు ప్రభుత్వం అప్పట్లో ప్రకటించిన విషయం తెలిసిందే.