ఉద్యోగులకు చంద్రబాబు పొగ: ఐదేళ్ల ముందే సాగనంపేందుకు వ్యూహం
వివిధ శాఖల్లో ప్రభుత్వోద్యోగాల్లో 25 ఏళ్లకే చేరిన వారు 50 ఏళ్లకే అంటే 30 ఏళ్ల సర్వీసు పూర్తి కాగానే ఇంటికి సాగనంపేందుకు చంద్రబాబు ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లన్నీ చేసేసేంది.
హైదరాబాద్ /అమరావతి: ఉద్యోగుల భారం తగ్గించుకోవడంలో చంద్రబాబు సర్కార్ తర్వాతే ఎవరైనా.. అందుకు నిదర్శనమే వివిధ శాఖల్లో ప్రభుత్వోద్యోగాల్లో 25 ఏళ్లకే చేరిన వారు 50 ఏళ్లకే అంటే 30 ఏళ్ల సర్వీసు పూర్తి కాగానే ఇంటికి సాగనంపేందుకు చంద్రబాబు ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లన్నీ చేసేసేంది. అందుకు అనుగుణంగా పెన్షన్ అర్హత నిబంధనను 33 నుంచి 30 ఏళ్లకు తగ్గించేశారు. దానికి సంబంధించిన ఫైళ్లన్నీ 'ఈ- ఆఫీస్' చకచకా ఆర్థిక, రెవెన్యూ, న్యాయశాఖల నుంచి ప్రధాన కార్యదర్శి వద్దకూ చేరిపోయాయి.
పనితీరు సరిగాలేదనే సాకుతో ప్రభుత్వ ఉద్యోగులను 50 ఏళ్లకే ఇంటికి పంపించేందుకు చంద్రబాబు సర్కార్ రూపొందించిన ఐదు ముసాయిదా జీవోలను లోతుగా అధ్యయనం చేసేకొద్దీ పలు కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కానీ వాస్తవాలు బయటకు రావడంతో అదంతా అబద్ధమని, తమ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమ ప్రభుత్వమని ఏపీ సీఎం చంద్రబాబు ఒక ప్రకటన చేయడం గమనార్హం.

30 ఏళ్లు దాటితే ప్రజా ప్రయోజనాల పేరిట ఇలా..
30 ఏళ్ల ప్రభుత్వ సర్వీసు పూర్తి చేసుకున్న వారిని ఉద్యోగ విరమణ చేయించడం ఇందులో ఒకటి. ఉదాహరణకు సతీశ్ బాబు అనే యువకుడు 25వ ఏట ప్రభుత్వ కొలువులో చేరితే 30 ఏళ్ల సర్వీసు పూర్తి చేసే నాటికి అతని వయసు 55 ఏళ్లు. ఈ లెక్కన 55 ఏళ్లు నిండగానే అతన్ని ఉద్యోగ విరమణ చేయించేందుకు వీలుగా ఉద్యోగుల విధి నిర్వహణలో ప్రాథమిక నిబంధనలు, పెన్షన్ నిబంధనల్లో సవరణలు తెస్తున్నారు. ఇదే జరిగితే సతీశ్ బాబు నిర్దిష్ట పదవీ విరమణ వయసు 60 ఏళ్లు నిండకుండానే ఐదేళ్లు ముందుగానే 55 ఏళ్లకే ఇంటికి వెళ్లిపోవాల్సి ఉంటుంది. సంబంధిత అథారిటీ ప్రజా ప్రయోజనాల పేరుతో ఏ ఉద్యోగినైనా 30 ఏళ్ల సర్వీసు పూర్తయ్యాక ఉద్యోగ విరమణ చేయించవచ్చని ప్రాథమిక నిబంధనలను సవరిస్తూ జీవోలు జారీ చేసేందుకు ఏపీలోని చంద్రబాబు సర్కార్ సిద్ధమైంది.
Recommended Video


మూడు నెలల వేతనంతో తప్పనిసరి రిటైర్మెంట్
30 ఏళ్ల సర్వీసు పూర్తయిన ఉద్యోగికి మూడు నెలలు ముందు రాత పూర్వకంగా నోటీసు ఇవ్వడం ద్వారాగానీ, మూడు నెలల వేతనం ఇచ్చేసి గానీ ఇంటికి పంపేయవచ్చని సవరణల్లో పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా 33 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులే పూర్తి పెన్షన్కు అర్హులన్న నిబంధనను 30 ఏళ్లకు తగ్గిస్తూ పెన్షన్ నిబంధనల్లో కూడా సవరణలు చేశారు. పరిపాలన వ్యవస్థను మరింత పటిష్టం చేయడంలో భాగంగా ఫండమెంటల్ రూల్స్, ఆంధ్రప్రదేశ్ రివైజ్డ్ పెన్షన్ రూల్స్లో సవరణల పేరుతో రూపొందించిన ముసాయిదా జీవోలకు ఆర్థిక, న్యాయ, సాధారణ పరిపాలన (సర్వీసెస్) శాఖలు ఆమోదం తెలిపాయి.

50 ఏళ్లకు రిటైర్మెంటయ్యే సిబ్బంది పరిస్థితి ఇలా
పనితీరు ప్రాతిపదికన 50 ఏళ్లకే ఇంటికి పంపే ఉద్యోగులకు సంబంధించిన ముసాయిదా జీవోల ఫైలు ఈ - ఆఫీస్ ద్వారా చకచకా ముందుకు కదిలింది. ప్రధాన ఫైలు (నెంబర్ జీఎడీ-56023/3/2017-ఏఎస్- పీయుఐ-జీఎడీ)కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ నెల 14న ఆమోదం తెలిపారు. అనంతరం 18న ఈ ఫైలు (ముసాయిదా జీవోలు)ను మూడు భాగాలుగా ఆర్థిక, న్యాయ, సాధారణ పరిపాలన (సర్వీసెస్) శాఖల ఆమోదం కోసం పంపారు. ఆర్థిక శాఖ ఇన్చార్జి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి 20న, సాధారణ పరిపాలన (సర్వీసెస్) శాఖ కార్యదర్శి 21న, న్యాయ శాఖ కార్యదర్శి 24న ఆమోదం తెలిపారు. ఆ తర్వాత వారి అభిప్రాయాలు కూడా జోడించి తుది ఆమోదం కోసం 26న తిరిగి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చేరాయి.

తమది ఉద్యోగ సంక్షేమ సర్కార్ అన్న చంద్రబాబు
50 ఏళ్ల సర్వీసు పూర్తయిన తర్వాత ఉద్యోగుల పదవీ విరమణకు జరుగుతున్న ప్రయత్నాలు అక్షర సత్యమని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పరోక్షంగా అంగీకరించారు. ముసాయిదా జీవోలే లేవంటూ కొట్టిపారేసిన ఆయన, ప్రభుత్వ తీరుపై ఉద్యోగుల్లో ఆగ్రహం వెల్లువెత్తడంతో తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఆదివారం మాట మార్చారు. ‘ముసాయిదాపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ఆర్థిక మంత్రిగా నేను సంతకం చేయలేదు. సీఎం సంతకం చేయలేదు. జీవో ఇవ్వాలంటే కేబినెట్ అమోదించాలి' అని తూర్పుగోదావరి జిల్లా తునిలో మీడియాతో అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సైతం మాట మార్చారు. తమది పూర్తిగా ఉద్యోగుల సంక్షేమ ప్రభుత్వమని సీఎం చంద్రబాబు అన్నారు. ఉద్యోగుల వయోపరిమితిపై ఎలాంటి ఉత్తర్వులు వెలువరించలేదని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications