ఫైలిన్ తుఫాను ప్రభావాన్ని ఎదుర్కుంటాం: రాధ
హైదరాబాద్: ఫైలిన్ తుఫాను ప్రభావాన్ని ఎదుర్కుకునేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ రాధ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తుఫాను తీరాన్ని తాకే సమయంలో భయంకరంగా ఉంటుందని ఆయన చెప్పారు.కళింగపట్నానికి 270 కి.మీ దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైందని, గతంలో ఎన్నడూ లేని విధంగా 240 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయని అన్నారు.
తుఫాన్ ప్రభావిత ప్రాంతల నుంచి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని కోరారు. ప్రభుత్వం అన్ని రకాల సహాయక చర్యలు తీసుకుంటుందని, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎస్ 25 బృందాలు, 500 మంది ఆర్మీ సిబ్బంది సేవలందిస్తున్నారని రాధ తెలిపారు.
తుఫానుతో రైళ్లు రద్దు
ఫైలిన్ తుఫాన్ ప్రభావంతో ముందస్తు చర్యల్లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే భారీగా రైళ్లను రద్దు చేసింది. పలు రైళ్ల దారులను మళ్లించినట్లు ప్రకటించింది. తిరుపతి-పూరి ఎక్స్ప్రెస్, చెన్నై సెంట్రల్-హసన్ ఫోల్ వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లు రద్దు కాగా, ముంబై, -భువనేశ్వర్ ఎక్స్ప్రెస్, విజయవాడ-విశాఖ ప్యాసింజర్ రైళ్లు పాక్షికంగా రద్దయ్యాయి. అల్లెప్పి-ధన్బాద్ ఎక్స్ప్రెస్ రైలును వరంగల్, బల్లార్ష మీదుగా మళ్లించారు. అలాగే యశ్వంత్పూర్ - హౌరా ఎక్స్ప్రెస్ రైలు ఖరగ్పూర్ మీదుగా, బెంగుళూరు-గౌహతి, కోరమాండల్, ఈస్ట్కోస్ట్, ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రైళ్లు బల్లార్ష మీదుగా మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
తుఫాన్ పరిస్థితులను సమీక్షించేందుకై జిల్లాకు చేరుకున్న మంత్రి రఘువీరారెడ్డి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఇప్పటి వరకు దాదాపు 64వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని మంత్రి తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అధికారులకు సహకరించాలని మంత్రి రఘువీరా కోరారు. ఆయన విశాఖపట్నంలో ఉండి తుఫాను పరిస్థితులను సమీక్షిస్తున్నారు.