గుడివాడ నీదా? నాదా? సై!
మాజీ మంత్రి కొడాలి నాని ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2004, 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున, 2014, 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున వరుసగా నాలుగుసార్లు విజయం సాధించారు. 2019 నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడంద్వారా నాని రాష్ట్రవ్యాప్తంగా అందరి నోళ్లల్లో నానుతున్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఆయన ప్రధాన టార్గెట్ గా మారారు.

వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గుడివాడ నుంచి కొడాలి నానిని ఓడించాలనే ప్రయత్నాల్లో తెలుగుదేశం ఉంది. ఇక్కడినుంచి పలువురు పేర్లు తెరపైకి వస్తున్నప్పటికీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి రావి వెంకటేశ్వరరావుతోపాటు ఎన్నారై రాము బరిలో నిలిచారు. తన సహజ స్వభావానికి భిన్నంగా ఏడాది ముందునుంచే నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారుచేసుకుంటూ వస్తున్న చంద్రబాబు గుడివాడ విషయంలో మాత్రం పాత వైఖరినే కొనసాగిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించిన బాబుకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వ్యక్తమైంది. దీంతో పార్టీకి ఈ గ్రిప్ పోకుండా ఉండేందుకు, వేడి తగ్గకుండా ఉండేందుకు నిరంతరం ప్రజల్లో ఉండాలంటూ నియోజకవర్గ నాయకులకు ఆదేశాలు జారీచేశారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్టిక్కర్లు అంటించే కార్యక్రమం కొనసాగుతోంది. నియోజకవర్గానికి కొద్దిరోజుల నుంచి కొడాలి నాని దూరంగా ఉండటంతో పార్టీ కార్యక్రమాల్లో వేగం పెంచాలని, నియోజకవర్గంలో అందుబాటులో ఉన్నా లేకపోయినా పార్టీ తరఫున వాయిస్ మాత్రం వినిపించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈనెల 28వ తేదీన ఎన్టీఆర్ శతజయంతి కావడంతో ప్రతి వార్డులోను వేడుకలు నిర్వహించాలని చంద్రబాబు పార్టీ యంత్రాంగాన్ని ఆదేశించారు. డీఎస్పీని కూడా కొత్తగా నియమించారు. రాబోయే మూడు వారాల్లో తెలుగుదేశం, వైసీపీ.. తమ తమ కార్యక్రమాలతో నియోజకవర్గాన్ని హోరెత్తించబోతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications