జగన్ కు లాస్ట్ ఛాన్స్- వదిలేస్తే 2024 వరకూ ఆగాల్సిందే- వాడుకుంటారా ? వదిలేస్తారా ?
ఏఫీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయింది. మరో రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. ఆ లోపు వైఎస్ జగన్ కోరుకుంటే ముందస్తు ఎన్నికలు కూడా తప్పేలా లేవు. ఇలాంటి కీలక తరుణంలో వైఎస్ జగన్ కు తన సత్తా నిరూపించుకునేందుకు ఓ మంచి అవకాశం లభిస్తోంది. దీన్ని వాడుకుంటే మాత్రం ఏపీలో విపక్షాలకు ఓ రేంజ్ లో చెక్ పెట్టేందుకు వీలవుతుంది. విఫలమైతే మాత్రం 2024 వరకూ ఎదురుచూడక తప్పదు.
Recommended Video


జంక్షన్లో వైఎస్ జగన్
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇప్పుడు నాలుగురోడ్ల కూడలిలో ఉన్నారు. ఇందులో ఎటువైపు వెళితే పరిస్ధితులు ఎలా మారతాయన్న దానిపై భిన్నమైన అంచనాలున్నాయి. దీంతో జగన్ ఎటువైపు వెళ్లాలనే దానిపై తీవ్రంగా మథనపడుతున్నట్లు కనిపిస్తోంది. మూడేళ్ల వైసీపీ పాలన పూర్తయి మరో రెండేళ్లలో ఎన్నికలు ఎదుర్కోవాల్సిన పరిస్ధితుల్లో జగన్ ఇప్పుడు తీసుకోబోయే నిర్ణయాలు కచ్చితంగా ఆయన పార్టీ వైసీపీ భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి. దీంతో జగన్ అడుగులపై ఆసక్తి పెరుగుతోంది.

రాష్ట్రపతి ఎన్నికల అవకాశం
వచ్చే నెలలో రాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్నాయి. వీటిలో బీజేపీకి పూర్తి మెజారిటీ లేదు. దీంతో వైఎస్ జగన్ వంటి పరోక్ష మిత్రులపై ఆధారపడాల్సిన పరిస్ధితి. వైసీపీ, అన్నాడీఎంకే వంటి పార్టీల్ని మచ్చిక చేసుకుంటే తప్ప బీజేపీ ఇక్కడ గట్టెక్కే అవకాశాలు లేవు. ఇలాంటి పరిస్ధితుల్లో వైఎస్ జగన్ మద్దతు ఎన్టీయే రాష్ట్రపతి అభ్యర్ధికి కీలకంగా మారింది. దీంతో జగన్ ను బుజ్జగించేందుకు త్వరలో నడ్డా లేదా రాజ్ నాథ్ సింగ్ ఏపీకి వచ్చే అవకాశాలున్నాయి. అయితే ఇది ఎన్టీయేకు ఎంత కీలకమో జగన్ కూ అంతే కీలకంగా మారింది.

జగన్ కు కీలకం ఎందుకంటే ?
ఏపీలో అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తి చేసుకున్న వైఎస్ జగన్.. ఇప్పటివరకూ కేంద్రం నుంచి రాష్ట్రానికి భారీగా తెచ్చిందేమీ లేదు. అలాగే విభజన హామీలు కానీ, సమస్యలు కానీ పరిష్కారం కూడా కాలేదు. ఇందులో ప్రత్యేక హోదాతో పాటు మరెన్నో సమస్యలు ఉన్నాయి. వీటిపై బీజేపీ ఇప్పటివరకూ అదిగో ఇదిగో అంటూ టైంపాస్ చేస్తూ వస్తోంది. గతంలో జగన్ విపక్షంలో ఉన్నప్పుడు సైతం రాష్ట్రపతి ఎన్నిక్లల్లో వైసీపీ ఓట్లు వేయించుకున్న బీజేపీ.. మరోసారి అదే పనిలో బిజీగా ఉంది. కానీ జగన్ పరిస్ధితి అలా కాదు. ఈసారి అధికారంలో ఉండి బీజేపీ అభ్యర్ధికి మద్దతు పలికితే రాజకీయంగా ఇబ్బందులు తప్పేలా లేవు.

జగన్ కు చివరి అవకాశం ?
కేంద్రంలో అదికారంలో ఉన్న బీజేపీ మెడలు వంచి ఏపీ విభజన హామీల్ని అమలు చేయించే సత్తా ఉందనే కారణంతో గతంలో ప్రజలు జగన్ కు అధికారం ఇచ్చారు. కానీ ఈ మూడేళ్లలో ఆయన కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నుంచి సాధించేదేమీ లేదు. అదేమని అడిగితే బీజేపీకి కేంద్రంలో పూర్తి మెజారిటీ ఉందని చెప్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల్లో అలా కాదు. వైసీపీ మద్దతు ఇస్తేనే బీజేపీ అభ్యర్ధులు గట్టెక్కుతారు. దీంతో ఈసారి జగన్ తమ మద్దతుకు ప్రతిగా రాష్ట్రానికి చెందిన సమస్యల్ని అడగాలని విపక్షాలతో పాటు సాధారణ ప్రజలు కూడా కోరుతున్నారు. మరి జగన్ ఈ అవకాశాన్ని వాడుకుంటారా లేక 2024లో తమ మద్దతు కోసం బీజేపీ ఎదురుచూసే పరిస్ధితిని కోరుకుంటూ మౌనంగా ఉండిపోతారా అన్నది తేలాల్సి ఉంది.












Click it and Unblock the Notifications