జెపి కోసం బిజెపి ఒత్తిడి: లోకసత్తా విలీనానికి బాబు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి మల్కాజిగిరి లోకసభ సీటు తలనొప్పి తగ్గలేదు. తాజాగా, లోకసత్తా అభ్యర్థి జయప్రకాష్ నారాయణ పెడుతున్న ఒత్తిడి ఆయనకు తలనొప్పిగా మారింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సిహెచ్. మల్లారెడ్డిని పోటీ నుంచి విరమింపజేయడానికి జయప్రకాష్ నారాయణ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకుగాను ఆయన బిజెపి జాతీయ నేతలను ఆశ్రయించారు.
తాను కేంద్రంలో బిజెపి మద్దతు ఇస్తానని జెపి హామీ ఇచ్చారు. దీంతో టిడిపి అభ్యర్థిని బరిలోంచి తప్పించడానికి బిజెపి అగ్ర నాయకులు రంగంలోకి దిగారు. రాజ్నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ చంద్రబాబుకు ఫోన్ చేసి, జెపికి మద్దతుగా టిడిపి అభ్యర్థిని పోటీ నుంచి విరమింపజేయాలని కోరినట్లు సమాచారం. అందుకు చంద్రబాబు నిరాకరించినట్లు తెలుస్తోంది. టిడిపి అభ్యర్థి పోటీలో ఉంటే ఓట్లు చీలిపోతాయనే ఆందోళనతో జెపి ఉన్నారు. కేంద్రంలో మోడీకి మద్దతు ఇచ్చి కేంద్ర మంత్రివర్గంలో చేరాలనే ఉద్దేశంతో జెపి ఉన్నారు.
నామినేషన్ల ఉపసంహరణకు శనివారం చివరి తేదీ. జెపి ఆశలు నెరవేరినట్లు లేవు. ఇటీవల జెపి చంద్రబాబునాయుడితో చర్చలు జరిపారు. మల్కాజిగిరి నుంచి తప్పుకుని కూకట్పల్లి శాసనసభా నియోజకవర్గానికి పోటీ చేస్తే తాను మద్దతు ఇస్తానని చంద్రబాబు జెపితో చెప్పినట్లు సమాచారం.
బిజెపి అగ్ర నాయకులు శుక్రవారం ఫోన్ చేయడంతో చంద్రబాబు జెపికి సంకేతాలు పంపినట్లు సమాచారం. లోకసత్తాను తమ పార్టీలో విలీనం చేస్తే మల్కాజిగిరిలో మల్లారెడ్డి నామినేషన్ను ఉపసంహరింపజేస్తానని చంద్రబాబు సంకేతాల సారాంశమని అంటున్నారు. నిజానికి, మల్కాజిగిరి లోకసభ సీటు కోసం టిడిపిలోనే పెద్ద యెత్తున పోటీ నెలకొంది. రేవంత్ రెడ్డితో పాటు పలువురు తెలంగాణ నాయకులు ఆ సీటును ఆశించారు. చివరకు మల్లారెడ్డికి చంద్రబాబు టికెట్ ఇచ్చారు.