మీరు సమర్ధులు, ఆ పని చేయగలరు: చంద్రబాబుతో ప్రధాని మోడీ
అమరావతి: ఫోన్ ట్యాపింగ్ పెద్ద నేరమని, దానిపై విచారణ జరిపించాలని బుధవారం ప్రధాని నరేంద్రమోడీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయిన సంగతి తెలిసిందే. మోడీతో చంద్రబాబు గంటసేపు ఏకాంతంగా ఏపీ, తెలంగాణ రాజకీయాలపై చర్చించారు.
అయితే ఈ చర్చల్లో వీరిద్దరి మధ్య రాజధాని గురించి ఓ ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుందట. చైనాలో 30 రోజుల్లో 60 అంతస్తుల నిర్మాణం చేశారని, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అలాంటి నిర్మాణమే చేయవచ్చు కదా అని ప్రధాని మోడీ స్వయంగా సీఎంతో అన్నారట. బాబు ఇది సాధ్యమా అని అడిగినట్లు సమాచారం.
మీరు సమర్ధులు, మీరు కాబట్టే ఆ పని చేయగలరని బాబుతో ప్రధాని అన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు గురువారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో గుంటూరు జిల్లా నేతలతో జరిపిన సమావేశంలో చెప్పినట్లు తెలిసింది. ప్రధాని నరేంద్రమోడీకి మనపై ఉన్న నమ్మకానికి ఇదే నిదర్శమని చంద్రబాబు అన్నారని సమాచారం.
ప్రస్తుతం చంద్రబాబు ఏపీలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి సారించారు. ఓటుకు నోటు వ్యవహారంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంభాణషలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న సీఎం చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వంపై బుధవారం ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
ఈ ఫిర్యాదుపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అంతేకాదు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంపై శాఖాపరమైన విచారణకు కేంద్రం ఆదేశించింది. బుధవారం రాత్రి ప్రధాని కార్యాలయం నుంచి ఈ మేరకు ఆదేశాలు వెలువడినట్లు తెలుస్తోంది.