జగన్కు బెయిల్ మంజూరు: జైల్లో 485 రోజులు
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి హైదరాబాదులోని నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆస్తుల కేసులో వైయస్ జగన్ 484 రోజులుగా హైదరాబాదులోని చంచల్గుడా జైలులో ఉన్నారు. బెయిల్ పిటిషన్పై తీర్పు వెలువడనున్న నేపథ్యంలో జగన్ సతీమణి వైయస్ భారతి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి, బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి నాంపల్లి కోర్టుకు వచ్చారు. జగన్ ఆస్తుల కేసులో సిబిఐ పది చార్జిషీట్లు దాఖలు చేసింది. ఈ చార్జిషీట్లన్నంటిలో వైయస్ జగన్ తొలి ముద్దాయిగా, విజయసాయి రెడ్డి రెండో ముద్దాయిగా ఉన్నారు.
ఇప్పటి వరకు బెయిల్ కోసం వివిధ కోర్టుల్లో జగన్ ఆరు పిటిషన్లు దాఖలు చేసుకున్నారు. వాటిని కోర్టులు తిరస్కరించాయి. ప్రస్తుతం వేసింది ఏడో బెయిల్ పిటిషన్. వైయస్ జగన్కు నాంపల్లి సిబిఐ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సాక్షులను ప్రభావితం చేస్తే బెయిల్ను రద్దు చేస్తామని కోర్టు షరతు పెట్టింది. అదే విధంగా రెండు లక్షల రూపాయలు, రెండు షూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. సాక్షులుగా ఉన్నవారితో మాట్లాడకూడదని కోర్టు జగన్ను ఆదేశించింది.

జగన్కు బెయిల్ మంజూరైందనే వార్త రాగానే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. పెద్ద యెత్తున నినాదాలు చేశారు. కోర్టు వద్దకు పెద్ద యెత్తున అభిమానులు తరలి వచ్చారు. నిరుడు మే 27వ తేదీన జగన్ను సిబిఐ అరెస్టు చేసింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో సంబరాలు జరిగాయి.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో దర్యాప్తు పూర్తయిందని సిబిఐ తెలిపింది. ఈ మేరకు సిబిఐ కోర్టులో మెమో దాఖలు చేసింది. హైకోర్టు సూచించిన అన్ని అంశాలపై దర్యాప్తు పూర్తయిందని సిబిఐ తెలిపింది. ఇందూ శ్యాంప్రసాద్ రెడ్డి వ్యవహారంపై దాఖలు చేసిన 9, 10 చార్జిషీట్లకు సంబంధించి కొత్త విషయాలు ముందుకు వచ్చాయని, వాటిపై తుది నివేదికను కోర్టుకు సమర్పిస్తామని సిబిఐ తెలిపింది.
వైయస్ జగన్ ఆస్తులపై ఆదాయం పన్ను శాఖ (ఐటి శాఖ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) విడివిడిగా దర్యాప్తు చేస్తున్నాయని, వాటికి తమ దర్యాప్తు నివేదికలను అందిస్తామని సిబిఐ తెలిపింది. వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఇప్పటి వరకు సిబిఐ పలు చార్జిషీట్లను దాఖలు చేసింది.
సండూర్ పవర్, కార్మెల్ ఏషియా, పీవీపీ బిజినెస్ వెంచర్స్, జూబ్లీ మీడియా కమ్యూనికేషన్స్, క్లాసిక్ రియాలిటీ కంపెనీ, బ్రహ్మణి ఇన్ఫ్రాటెక్, ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ ప్రైజెస్ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్, మంత్రి డెవలపర్స్ కంపెనీల్లో క్విడ్ప్రోకో ఆధారాలు లేవని సీబీఐ తెలిపింది. అయితే ఈ కేసుల్లో ఇతర ఉల్లంఘనలకు పాల్పడ్డారని, వీటిపై చర్యలకు ఐటీ, ఈడీ విభాగాలకు సిఫార్సు చేసినట్లు సిబిఐ పేర్కొంది.












Click it and Unblock the Notifications