దౌర్భాగ్యపు సీఎం, రిజైన్ చేస్తున్నా: చెప్పుతో కొట్టుకున్న వైసిపి ఎమ్మెల్యే
అధికారుల తీరును నిరసిస్తూ పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఆదివారం తాను శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన అధికారుల తీరును నిరసిస్తూ చెప్పుతో కొట్టుకున్నారు.
కడప: అధికారుల తీరును నిరసిస్తూ పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఆదివారం తాను శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన అధికారుల తీరును నిరసిస్తూ చెప్పుతో కొట్టుకున్నారు.
పొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వివాదం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఆదివారం కూడా ఉద్రిక్తతల కారణంగా ఎన్నిక వాయిదా పడింది.
దీంతో ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి, వైసిపి సభ్యులు రిటర్నింగ్ అధికారి వినాయకంను అడ్డుకున్నారు. ఎన్నిక జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి తొత్తుగా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం చెప్పినట్లు ప్రిసైడింగ్ అధికారి వ్యవహరిస్తున్నారన్నారు.
చెప్పుతో కొట్టుకున్న రాచమల్లు
అధికారుల తీరును నిరసిస్తూ రాచమల్లు ప్రసాద్ రెడ్డి తనను తాను చెప్పుతో కొట్టుకున్నారు. ఆ తర్వాత రాజీనామా చేస్తానని చెప్పారు. కాగా, సభలో గందరగోళం అంశాన్ని ప్రిసైడింగ్ అధికారి ఈసికి నివేదిక పంపించారు. శాంతిభద్రతల దృష్ట్యా ఎన్నికను వాయిదా వేసినట్లు చెప్పారు.
ఉరివేసుకుంటానని టిడిపి కౌన్సెలర్
అంతకుముందు, ఎన్నికలను వాయిదా వేయకుంటే ఉరి వేసుకుంటానంటూ ఓ విద్యుత్ వైరును టీడీపీ కౌన్సిలర్ మెడకు చుట్టుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆపై టీడీపీ, వైసిపి సభ్యులు నినాదాలు, ప్రతినినాదాలతో హోరెత్తించారు.
ఎన్నికల వాయిదాకు పోలీసులు, అధికారులే కారణమని ఆరోపిస్తూ వైసిపి సభ్యులు మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని, వారి ఆగడాలను ప్రజలే అడ్డుకుంటారని ఎమ్మెల్యే రాచమల్లు అన్నారు. పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఈ ప్రభుత్వం మానభంగం చేసిందన్నారు.
అధికారి చంద్రబాబు చెంచా, లోకేష్ ఎంత చెప్తే అంతా: రాచమల్లు
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం రాజకీయాలు ఇలాగే ఉంటాయని చెప్పారు. ఈ దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఉన్నంత కాలం తాను ఉండలేక శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. ఈ అధికారి చంద్రబాబు చెంచా అన్నారు. లోకేష్ ఏం చెబితే అది చేస్తున్నారన్నారు.
దౌర్భాగ్యపు సీఎం వల్లే రాజీనామా
నా శాసన సభ్యత్వానికి రాజీనామా చేయడానికి ప్రభుత్వం కారణమన్నారు. అలాగే, ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్న అధికారులు, పోలీసులు కారణమని ఆరోపించారు. దౌర్భాగ్యపు సీఎం ఉండగా తాను ఎమ్మెల్యేగా ఉండలేనని చెప్పారు. టిడిపి సభ్యులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.