‘వచ్చేసారి గెలిస్తే చాలు.. టీడీపీవే 20ఏళ్లు’
వచ్చే ఎన్నికల్లో గెలిస్తే 2దశాబ్ధాల పాటు టీడీపీ అధికారంలో ఉంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డి(వాసు) అన్నారు.
కడప: వచ్చే ఎన్నికల్లో గెలిస్తే రెండు దశాబ్ధాల పాటు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డి(వాసు) అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరాలన్నా కార్యకర్తలే వారధులన్నారు.
2019లో జరగబోయే ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధం కావాలని సూచించారు. తిరుపతిలో జరుగుతున్న టీడీపీ రాయలసీమ శిక్షణ శిబిరానికి సోమవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా వాసు మాట్లాడారు. ప్రతి కుటుంబం ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి పొందిందన్నారు.

రాయలసీమలో శాశ్వత కరువు నివారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారన్నారు. ప్రతిపక్ష నేత జగన్ తన బాధ్యతను నిర్వర్తించకుండా 30 ఏళ్లు సీఎంగా ఉంటానంటూ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. దొంగలు, దోపిడీదారుల సమావేశంగా ప్లీనరీ జరిగిందన్నారు.
పార్టీ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 30 వేల మందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి అన్నారు. కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుందన్నారు. నియోజకవర్గంలో పార్టీలో జరుగుతున్న విషయాలు, పార్టీ లోపాలు చెబితే సవరించుకుంటామని తెలిపారు.












Click it and Unblock the Notifications