వంగవీటి రాధా టార్గెట్ ఫిక్స్ - కొడాలి నాని వ్యాఖ్యల వెనుక : ఆ ఒక్కటి అంగీకరిస్తే..!!
బెజవాడ రాజకీయాల్లో సమీకరణాలు మారిపోతున్నాయి. తాజాగా వంగవీటి రంగా వర్దంతి వేళ..ఆయన తనయుడు వంగవీటి రాధా చేసిన సంచలన వ్యాఖ్యలు..ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తనను పొట్టన పెట్టుకొనే ప్రయత్నాలు చేస్తున్నారని...రెక్కీ నిర్వహించారంటూ తన వ్యాఖ్యలతో కలకలం రేపారు. త్వరలోనే వారెవరో కూడా తెలుస్తుందంటూ వ్యాఖ్యానించారు. ఆ సమయంలో మంత్రి కొడాలి నాని.. టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వంశీ సైతం రాధా పక్కనే ఉన్నారు. దీంతో.. రాధా ఎవరిని లక్ష్యంగా చేసుకొని ఈ విమర్శలు చేశారనే చర్చ మొదలైంది.
రాధాను ఆ ఇద్దరూ ఒప్పిస్తారా
కొడాలి నాని..వంగవీటి రాధా.. వల్లభనేని వంశీ మంచి మిత్రులు. రాజకీయంగా వేర్వేరు పార్టీల్లో కొనసాగినా..వారి మత్ర మైత్రి మాత్రం కంటిన్యూ అవుతోంది. ఇక, తాజా పరిణామంలో ఆదివారం ఉదయమే ఎమ్మెల్యే వంశీ, రాధా కలవడం.. వారిద్దరూ ఏకాంతంగా చర్చించుకోవడం ..ఆ తరువాత ఆసక్తి కర పరిణామాలు వేగంగా చోటు చేసుకున్నాయి. రాధాను తిరిగి వైసీపీ గూటికి తీసుకొచ్చేందుకు వంశీ, నాని ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు కొంతకాలంగా ప్రచారంలో ఉన్నాయి. టీడీపీలో సాగుతున్న వర్గ విభేదాల వేళ..పట్టు సాధించేందుకు వైసీపీ ఇదే సరైన సమయంగా భావిస్తోంది.
మంత్రి నాని ఆసక్తి కర వ్యాఖ్యలు
దీంతో..రాధాను తిరిగి వైసీపీలోకి రావటానికి సిద్దంగానే ఉన్నా..ఆయన ఒక అంశం పైన పట్టుబడుతున్నారనే చర్చ వినిపిస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో రాధా తిరిగి వైసీపీ గూటికి వెళ్తున్నారనే ప్రచారం మొదలైంది. కానీ, రాధా వైసీపీలో చేరే ప్రశ్నే లేదని ఆయన అభిమానులు చెబుతున్నా, జరుగుతున్న పరిణామాలు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. రాధా తన పైన రెక్కీ జరిగిందని స్పందించిన కార్యక్రమంలోనే మంత్రి కొడాలి నాని ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. రాధా తనకు తమ్ముడు లాంటి వాడన్నారు.
ఆ ఒక్క కండీషన్ చుట్టూ మొత్తం వ్యవహారం
ఎమ్మెల్సీ ఇస్తామని అప్పట్లో టీడీపీ నాయకులు చెప్పినా.. పదవులను ఆశించకుండా ఆయన ఆ పార్టీలో చేరారు. బంగారంలాంటి రాధా తన జీవితంలో కాస్త రాగి మిశ్రమాన్ని కలిపి రాజీపడితే పరిస్థితి మరోలా ఉండేది. రాగి కలిపితేనే బంగారం కూడా కావలిసిన ఆకృతిలో వస్తుంది. కానీ కల్మషం లేకుండా తాను నమ్మిన దారిలోనే రాధా నడుస్తున్నారని ప్రశంసించారు. ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న పరమార్దం ఏంటనే దాని పైన కీలక చర్చ సాగుతోంది. అందులో భాగంగా.. రాధా వైసీపీలోకి రావాలంటే ఒక అంశం పైన షరతు చుట్టూ నిర్ణయం ఆధారపడినట్లు తెలుస్తోంది.
ఆ ఒక్కటీ మినహా అంటున్న వైసీపీ
2019 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని రాధా భావించారు. కానీ ఆ సీటును రాధాకు కేటాయించడం ససేమిరా కుదరదని అప్పట్లో ఆ పార్టీ అధిష్ఠానం తేల్చి చెప్పింది. కాంగ్రెస్లో ఉన్న మల్లాది విష్ణు ఆ ఎన్నికలకు ఏడాది ముందు వైసీపీలో చేరడంతో క్రమంగా సీను మారుతూ వచ్చింది. తొలుత విష్ణును నగర వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారు. నగర స్థాయిలో పదవి ఉన్నప్పటికీ, ఆయన ఎక్కువగా సెంట్రల్ నియోజకవర్గంపైనే దృష్టి సారిస్తూ కార్యక్రమాలు నిర్వహించడం ప్రారంభించారు.
తనను కాదన్న చోటే..తనకు ఛాన్స్ ఇస్తేనే
తాను సమన్వకర్తగా ఉన్న సెంట్రల్లో తన ప్రమేయం లేకుండా కో-ఆర్డినేటర్లను నియమించడంపై రాధా ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో సెంట్రల్ సీటు మల్లాది విష్ణుకు ఇవ్వాలని నిర్ణయించిన వైసీపీ అదిష్టానం... రాధాను మచిలీపట్నం నుంచి ఎంపీగా పోటీ చేయాలని కోరింది. దానికి రాధా ఇష్టపడలేదు. పార్టీని వీడారు.
జగన్ పైన విమర్శలు చేసారు. ఆ తరువాత కొంత కాలానికి టీడీపీలో చేరినా..రాజకీయంగా అంత యాక్టివ్ గా మాత్రం లేరు. ఇప్పుడు తన స్నేహితులు నాని - వంశీ ఇద్దరూ తిరిగి రాధాను వైసీపీలోకి రావాలని .. జగన్ సైతం రాధా పట్ల సానుకూల వైఖరితోనే ఉన్నారంటూ వారు చెబుతున్నట్లుగా తెలుస్తోంది.
ఆసక్తి కరంగా మారుతున్న రాధా రాజకీయం
అయితే, తనకు తిరిగి సెంట్రల్ ఇన్ ఛార్జ్ పదవి ఇచ్చి..వచ్చే ఎన్నికల నాటికి అభ్యర్ధిగా ప్రకటిస్తే రాధా వైసీపీ లోకి రావటానికి అభ్యంతరం లేదని చెబుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే, అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉండటంతో..దాని పైన వైసీపీ హామీ ఇవ్వలేక పోతోంది. ఈ కండీషన్ - చర్చల సారాంశమే మంత్రి కొడాలి నాని బంగారంలాంటి రాధా తన జీవితంలో కాస్త రాగి మిశ్రమాన్ని కలిపి రాజీపడితే పరిస్థితి మరోలా ఉంటుందని వ్యాఖ్యానించినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీంతో.. ఇప్పుడు చోటుచేసుకుంటున్న పరిణామాలు రాధా భవిష్యత్తు రాజకీయ అడుగుల పైన ఆసక్తిని కలిగిస్తున్నాయి.