నాకూ సీఎం జగన్ కు దూరం పెంచకండి .. ఈ గొడవలకు కారణం విజయసాయి రెడ్డినే : రఘురామ వ్యాఖ్యలు
ఏపీ రాజకీయాలలో అధికార పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం పెను దుమారంగా మారింది. పార్టీకి, అధినేతకు వ్యతిరేకంగా మీడియా ముఖంగా చేస్తున్న వ్యాఖ్యలకు గాను నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు పార్టీ తరఫున షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది. దీనికి ఘాటుగా రిప్లై ఇచ్చిన రఘురామకృష్ణంరాజు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిని తూర్పారబట్టారు.అంతేకాదు నేడు ఢిల్లీలో పర్యటిస్తున్న రఘురామకృష్ణంరాజు కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు.

కావాలనే సీఎంకు తనకు దూరం పెంచారన్న రఘురామ
అధికార వైసీపీ ఎంపీగా ఉండి సొంత పార్టీ నేతల వల్లే ప్రాణహాని ఉందంటూ ఆరోపణలు గుప్పించిన రఘురామకృష్ణంరాజు కావాలనే సీఎం జగన్మోహన్ రెడ్డికి తనను దూరం చేస్తున్నారని మండిపడుతున్నారు. వీలైతే సీఎం జగన్తో కలిసి మాట్లాడే అవకాశం కల్పించాలని కోరుతున్న రఘురామకృష్ణంరాజు పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటీసులు చెల్లవని వాదిస్తున్నారు. ఈ గొడవలకు కారణం అయిన విజయసాయిపై నిప్పులు చెరుగుతున్నారు.

షోకాజ్ నోటీసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్
నిన్నటికి నిన్న లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ను ,ఎన్నికల కమిషన్ ను కలిసి మాట్లాడిన రఘురామకృష్ణంరాజు, నేడు మరోసారి ఈసీ ని కలవనున్నారు. ఈ నేపథ్యంలో మాట్లాడిన ఆయన షోకాజ్ నోటీసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రితో తనకు మరింత భేదాభిప్రాయాలను సృష్టించవద్దని విజ్ఞప్తి చేసిన రఘు రామ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తనకు అవకాశమిస్తే నోటీసులకు సవివరంగా సమాధానం ఇస్తానని పేర్కొన్నారు.

సీఎం జగన్ అపాయింట్మెంట్ కోసం విజ్ఞప్తి
ముఖ్యమంత్రిని కలిసేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని ఇప్పటికే తాను విజ్ఞప్తి చేశానని పేర్కొన్న నరసాపురం ఎంపీ ముఖ్యమంత్రి తనకు సమయం ఇవ్వకపోయినా, పోస్టులో అయినా సరే తన సమాధానాన్ని పంపిస్తా అంటూ తేల్చి చెప్పారు. ఈ రోజు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్,అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తో భేటీ అయిన ఆయన పలు అంశాలపై చర్చించారు.ఒకపక్క పార్టీ నుండి షోకాజ్ నోటీసులు అందిన సమయంలో రఘురామకృష్ణంరాజు ఢిల్లీ పర్యటన, మంత్రులను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Recommended Video

ఈ గొడవలకు కారణం విజయసాయిరెడ్డి అని ఫైర్
ఇక ఈ వ్యవహారంలో తాను న్యాయవాదులతో సంప్రదిస్తున్నారని షోకాజ్ నోటీసుకు సమాధానం ఇవ్వాలా ? లేక జరిగిన పరిణామాలన్నింటినీ ముఖ్యమంత్రికి సవివరంగా సమాచారం అందించాలా అన్నది చర్చిస్తున్నాం అని పేర్కొన్నారు. ఇప్పటికే తనకు రక్షణ కావాలని లోక్ సభ స్పీకర్ కు, కేంద్రానికి విజ్ఞప్తి చేసిన ఆయన ఇప్పటికీ సీఎం జగన్ మాట్లాడడానికి అవకాశం ఇస్తే వెళ్లి కలుస్తాను అని పేర్కొంటున్నారు. కేంద్ర రక్షణ కల్పించాకే తాను తన నియోజకవర్గానికి వెళ్తానని పేర్కొన్నారు. అయితే సీఎం జగన్ అవకాశం ఇస్తారని తాను అనుకోవడం లేదని అంటూ వ్యాఖ్యానించారు. ఈ గొడవలు అన్నింటికీ కారణం విజయసాయిరెడ్డి అని వ్యాఖ్యానించారు రఘురామ కృష్ణంరాజు.












Click it and Unblock the Notifications