వెనక్కి వెళ్లొద్దు: మూడు రాజధానుల తాజా ప్రభుత్వ నిర్ణయంపై రఘురామకృష్ణరాజు
న్యూఢిల్లీ/అమరావతి: మూడురాజధానుల నిర్ణయం వెనక్కి తీసుకోవడంపై అమరావతి రైతులతోపాటు ప్రతిపక్షాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ముందునుంచీ అమరావతికి తన మద్దతు ప్రకటించి, రాజధాని రైతులకు బాసటగా నిలిచారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ నేత, నరసాపురం ఎంపీ రఘురామ.
తాజాగా మూడు రాజధానుల బిల్లును ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకోవడంపై రఘురామ కృష్ణరాజు ఆనందం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ.. ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయంపై సాధించిన విజయమని రఘురామ అభిప్రాయపడ్డారు.
మూడు రాజధానులకు వ్యతిరేకంగా నిరంతరం పోరాటం చేసిన రైతులు, వారికి సహకరించిన వారికి రఘురామ అభినందనలు తెలిపారు. ఈ నిర్ణయం మళ్లీ వెనక్కి వెళ్లకుండా రాజధానులు మూడు కాదు.. రెండు అని ఎటువంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. గత ప్రభుత్వం ప్రకటించిన రాజధాని(అమరావతి)ని అభివృద్ధి చేయాలని కోరారు.
లేదంటే దానికంటే మెరుగ్గా రాజధాని నిర్ణయం ప్రకటించాలన్నారు. జై అమరావతి.. జై జై అమరావతి అని సంతోషం వ్యక్తం చేశారు రఘురామ. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన అనంతరం జరిగిన నిర్ణయం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అని రఘురామ అన్నారు.
ఇది ఇలావుండగా, మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం ప్రకటించడంతో రాజధాని ప్రాంతం, మహాపాదయాత్ర చేస్తున్న రైతులు, మహిళలు హర్షం వ్యక్తం చేశారు. మూడు రాజధానులు, వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను కేబినెట్ రద్దు చేసినట్లు అడ్వోకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపిన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు అమరావతి జేఏసీ ప్రకటించింది.
ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎప్పటికైనా వెనక్కి తీసుకోవాల్సిందేనని వ్యాఖ్యానించింది. ఇకనైనా అమరావతి ప్రాంతాన్ని త్వరగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేసింది అమరావతి జేఏసీ. ఇన్నాళ్లూ అమరావతిని విమర్శించిన వాళ్లు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఇక తమ మహాపాదయాత్ర కొనసాగుతుందని జేఏసీ స్పష్టం చేసింది. ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించే వరకూ ఉద్యమం ఆగదని జేఏసీ తేల్చి చెప్పింది.