రఘురామ ఒంటిపై దెబ్బలు... సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు.. ఆ వ్యాధి ఉంటే కాళ్లు అలాగే ఉంటాయని...
ప్రభుత్వంపై కుట్రపూరిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో రాజద్రోహం అభియోగం కింద సీఐడీ కస్టడీలో ఉన్న ఎంపీ రఘురామ కృష్ణరాజును పోలీసులు కొట్టారన్న ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. శనివారం(మే 15) మధ్యాహ్నం రఘురామను సీఐడీ కోర్టులో ప్రవేశపెట్టగా... పోలీసులు నిన్న రాత్రి తన కాళ్లు వాచిపోయేలా కొట్టారని ఆయన లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి హైకోర్టులోనూ పిటిషన్ దాఖలవగా... దీనిపై విచారణకు స్పెషల్ డివిజన్ బెంచ్ ఏర్పాటైంది. ఈ నేపథ్యంలో రఘురామను నిజంగానే పోలీసులు కొట్టారా... లేక వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నట్లు ఇదంతా డ్రామా అన్న చర్చ జరుగుతోంది.
Recommended Video
షుగర్ వల్లే కాళ్లు అలా.. సోషల్ మీడియాలో ప్రచారం...
ఎంపీ రఘురామ కృష్ణరాజును పోలీసులు కొట్టారన్న ఆరోపణల నేపథ్యంలో సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రఘురామ అనుకూల వర్గం పోలీసుల తీరును ఖండిస్తూ పోస్టులు పెడుతుంటే వైసీపీ వర్గాలు ఇదంతా వట్టి డ్రామా అని పోస్టులు పెడుతున్నారు. రఘురామ కృష్ణరాజుకు షుగర్ వ్యాధి ఉందని... అందువల్లే ఆయన కాళ్లు అలా ఉన్నాయని వైసీపీ అనుకూల వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. కొంతమంది నెటిజన్లు దీనిపై స్పందిస్తూ... ఫెరిపెరల్ వాస్కులర్ డిసీజ్ ఉన్నవారికి,సొరియాసిస్ ఉన్నవారికి కాళ్లు ఇలా అవుతాయని చెబుతుండటం గమనార్హం.
భగ్గుమంటున్న రఘురామ అనుకూల వర్గం...
ఎంపీ రఘురామ కృష్ణరాజును పోలీసులు కొట్టారనడం శుద్ద అబద్దమని వైసీపీ అనుకూల వర్గాలు అంటున్నాయి. రఘురామ కృష్ణరాజు కోర్టును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి సైతం పేర్కొన్నారు. ఆయన్ను పోలీసులు కొట్టారనడం పూర్తిగా కట్టు కథ అన్నారు.మరోవైపు రఘురామ అనుకూల వర్గాలు మాత్రం ఆయనపై నిజంగానే దాడి జరిగిందని ఆరోపిస్తున్నాయి. అంతేకాదు,వినాశకాలే విపరీతబుద్ది... రఘురామ అరెస్టుతో జగన్కు అంతిమ గడియలు వచ్చేశాయని సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
రిమాండ్ రిపోర్టుపై హైకోర్టు నిర్ణయం..?
అంతకుముందు,గుంటూరులోని సీఐడీ కోర్టు ఎంపీ రఘురామ కృష్ణరాజుకు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే ఆయన కాళ్లపై గాయాలు ఉండటంతో ఎంపీని ఆస్పత్రికి తరలించాలని సూచించింది.ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లేందుకు రఘురామ నిరాకరించడంతో విజయవాడలోని రమేశ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించాలని సూచించింది. ఆయన కోలుకునేవరకు ఆస్పత్రిలో ఉండవచ్చునని... వై కేటగిరీ భద్రత కొనసాగుతుందని స్పష్టం చేసింది. గాయాలకు సంబంధించి రెండు రోజుల్లో మెడికల్ ఎగ్జామినేషన్కు ఆదేశించింది. మరోవైపు హైకోర్టు రఘురామ కాళ్లపై గాయాలకు సంబంధించి తీవ్ర స్థాయిలో ఫైర్ అయింది. ఎంపీ ఒంటిపై నిన్న లేని దెబ్బలు ఇవాళ ఎక్కడివని ప్రశ్నించింది. రిమాండ్ రిపోర్టును పరిశీలిస్తున్న న్యాయస్థానం దానిపై మరికాసేపట్లో నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.