బీహార్ ఎఫెక్ట్: చంద్రబాబు వెంటే ఉంటామని రఘువీరా, వారిని ఉరి తీయాలి
హైదరాబాద్: ఢిల్లీ వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అన్నింటిని సాధించుకు రావాలని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి మంగళవారం అన్నారు. ఢిల్లీ వెళ్తున్న చంద్రబాబుకు మేం మద్దతుగా నిలుస్తున్నామని చెప్పారు.
బీహార్కు రూ.1.65 లక్షల కోట్ల ప్యాకేజీ పైన రఘువీరా స్పందిస్తూ... ఏపీకి మొండి చేయి చూపినట్లు అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీహార్కు కూడా కేంద్రం మొండిచేయి చూపిస్తుందన్నారు. ప్రతి హామీకి కాలపరిమితి ఉండాలన్నారు.
ఓట్ల కోసమే బీహార్కు ప్రత్యేక ప్యాకేజీ అన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు తలోమాట మాట్లాడకుండా చూసుకోవాలని ఆ పార్టీకి హితవు పలికారు. ఏడాదిలో పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ కేంద్రమంత్రులు దద్దమ్మలు అని ధ్వజమెత్తారు.
ఈవ్ టీజర్లను ఉరి తీయాలి
ఈవ్ టీజింగ్కు పాల్పడిన వారిని ఉరితీయాలని మండిపడ్డారు. విద్యార్థులు చనిపోతే యాజమాన్యాల నుంచి రూ.25 లక్షలు ఇప్పించాలన్నారు. కేసుల పరిష్కారానికి ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలన్నారు.
ఓటుకు నోటుపై...
ఓటుకు నోటు కేసులో ఇరువురు ముఖ్యమంత్రులు (తెలంగాణ సిఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఏపీ సిఎం నారా చంద్రబాబు నాయుడు)లు సిబిఐ విచారణ కోరాలన్నారు. ఈ నెల 24వ తేదీన ఏపీసీసీ విస్తృతస్థాయి సమావేశం ఉంటుందని చెప్పారు.
పేదల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: చంద్రబాబు
తమ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం చిత్తూరు జిల్లాలో అన్నారు. ఉదయం ఆయన కుప్పంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. అవినీతికి తావులేకుండా పెన్షన్లు పంపిణీ చేస్తున్నామన్నారు.
ఉల్లి ధర చుక్కలు అంటుతుండటంతో ఏపీలో కిలో ఉల్లిని రూ.20కే ఇస్తున్నామని చెప్పారు. గోదావరి నుంచి నీళ్లు తెస్తుంటే కొందరు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఉదారంగా సాయం చేయాలన్నారు.