క్రిస్టియన్ల మనోభావాలకు దెబ్బ: రఘువీరా, తెరాసపై డికె
హైదరాబాద్: క్రిస్మస్ రోజున గుడ్ గవర్నెన్స్ డే జరపడం కేంద్రానికి సముచితం కాదని ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రఘురారెడ్డి అన్నారు. ఆయన బుధవారం మాట్లాడుతూ.. ఈ చర్య క్రిస్టియన్ల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా, వారికి అభద్రతను కల్పించడమే అని అన్నారు.
బిజెపి రాజ్యాంగ సెక్యూలరిజంకు కట్టుబడకుండా, లౌకిక తత్వానికి భంగం కల్పించేలా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని రఘువీరా రెడ్డి ఆరోపించారు. అటువంటి మతవాద ధోరణులపై తెలుగుదేశం పార్టీ ప్రశ్నించడం లేదని అన్నారు. లౌకక తత్వానికి భంగం కలుగుతున్నా మౌనంగా ఉండటం ప్రమాదకరమేనని రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు.
మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్పాయికి భారతరత్న ఇవ్వడం సంతోషకరమని ఆయన అన్నారు. కాగా, డిసెంబర్ 25న వాజ్పాయి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఆ రోజును సుపరిపాలన దినోత్సవంగా జరపాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
పింఛన్ల విషయంలో టిఆర్ఎస్ నేతల జోక్యం తగదు: డికె
తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన చాలా మందికి పింఛన్లు అందడం లేదని సీనియర్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే డికె అరుణ అన్నారు. ఆమె బుధవారం మాట్లాడుతూ.. తాము చెప్పినట్లుగానే పింఛన్లు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు అధికారులను బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
థర్మల్ విద్యుత్ ప్లాంటు కోసం గతంలోనే మహబూబ్నగర్లో స్థలాన్ని గుర్తించారని ఆమె అన్నారు. త్వరగా ఆ ప్రాజెక్టును పూర్తి చేసి తెలంగాణ విద్యుత్ కష్టాలు తీర్చాలని అన్నారు. నల్గొండలో ప్రతిపాదిస్తున్న థర్మల్ విద్యుత్ ప్లాంటుకు అటవీశాఖ నుంచి అనుమతులు రావడం కష్టమని, అందుకే మహబూబ్నగర్ జిల్లాలో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని కోరారు.