ఆత్మహత్యలు ప్రభుత్వ వైఫల్యమే, కారణాలడగుతారా?: చంద్రబాబును ఏకేసిన రఘువీరా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నిరుడు లక్షల ఎకరాల పంటనష్టం జరిగినా.. ఒక్క ఎకరానికి కూడా బీమా డబ్బులు రైతులకు ఇవ్వలేకపోయిందని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
చంద్రబాబు ప్రభుత్వం రైతు ఆత్మహత్యలను కప్పిపుచ్చుతోందని ఆరోపించారు. ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డులను రద్దు చేసిందని, ఇందులో 80శాతం రైతులవే ఉన్నాయని చెప్పారు. ఇప్పటి వరకు ఒక్క కైలు రైతు రుణ మాఫీ చేశారా? అని చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు.
ఆత్మహత్యలకు కారణాలడుగుతున్నారని ధ్వజమెత్తారు. గతంలో ఇచ్చిన సిఫార్సులన్నింటినీ పాతరేసి.. ఈరోజు చిలుకపలుకులు పలికితే ఆత్మహత్యలు ఆగుతాయా? అని ప్రశ్నించారు. చంద్రబాబు వైఫల్యమే రైతు ఆత్మహత్యలకు కారణమని ఆరోపించారు.
రూ. 24వేల కోట్ల రుణాలు మాఫీ చేయకున్నా.. చేసినట్లు చెప్పుకుంటున్నారని మంత్రులపై ధ్వజమెత్తారు. రుణాలు మాఫీకాక, కొత్త రుణాలు అందకపోవడంతోనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు.
సాగునీటి ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో ఒక్క ఎకరానికైనా సాగునీరందించారా? అని రఘువీరా రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో 12లక్షల మంది పింఛన్ల రద్దు చేశారని చంద్రబాబుపై మండిపడ్డారు.