తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ స్థానంలో వందే మెట్రో ..!!
వందేభారత్. రైల్వే ప్రయాణీకులకు కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ రైళ్ల స్థానంలో మరో మార్పు చేసేందుకు రైల్వే శాఖ సిద్దమైంది. ఇప్పటి వరకు 16 బోగీలతో నడుస్తున్న వందే భారత్ ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే అందుబాటులో ఉన్నాయి. ఇక నుంచి వీటి స్థానంలో 8 బోగీలతో వందే మెట్రో రైళ్లను తీసుకురావాలని నిర్ణయించారు. ఈ మేరకు రైల్వే మంత్రి ప్రకటన చేసారు. దేశ వ్యాప్తంగా వీటిని అందుబాటులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఒక వందే భారత్ అందుబాటులో ఉండగా.. మరో మూడు కొత్తవి పట్టాలెక్కేందుకు సిద్దంగా ఉన్నాయి. కొత్తగా రానున్న వందేమెట్రో రైళ్లు ఎక్కడ అవసరం ఉంటుంది..ప్రయాణీకు రద్దీ వివరాల ఆధారంగా కసరత్తు ప్రారంభమైంది.
వందే మెట్రోతో కొత్త ప్రతిపాదన
తాజాగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో రైల్వే శాఖకు గత ఏడాది కంటే దాదాపుగా లక్ష కోట్లు పెంచి నిధులు కేటాయించారు. అందులో ఈ సారి వందేభారత్ కు ప్రాధాన్యత ఇస్తామని..కొత్త లైన్ల పెంపు పైన ఫోకస్ పెడతామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. వందే భారత్ తరహాలోనే వందే మెట్రోలను కూడా అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్టు వెల్లడించారు. నగరాలకు ఆనుకొని ఉన్న ప్రాంతాల ప్రజల సౌలభ్యం కోసం తీసుకొస్తున్నట్లు చెప్పుకొచ్చారు. లాగానే ఈ రైలులో కూడా బ్రేక్ సిస్టమ్, రెడ్ సిగ్నల్ బ్రేకింగ్ నిరోధించడానికి కవాచ్ సేఫ్టీ సిస్టమ్, ఫైర్ సెన్సార్, జీపీఎస్, ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాట్లతో ఇవి ప్రయాణికులకు సరికొత్త అనుభవాన్ని అందిస్తాయని వివరించారు.
నగరాలు టు సమీప ప్రాంతాలు
ఈ వందే మెట్రో పూర్తిగా వందే భారత్ కు మినీ వెర్షన్ గా తీసుకురానున్నారు. సామాన్యులు, ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు, పర్యాటకులకు వెసులుబాటుగా, అత్యాధునిక సౌకర్యాలతో అందుబాటులోకి తెస్తామని రైల్వే మంత్రి వెల్లడించారు. నగరాల చుట్టుపక్కల 50-60 కిలోమీటర్ల దూరంలో ఉన్నవారు పనికోసం నగరానికి వచ్చి మళ్లీ తమ స్వస్థలాలకు చేరుకునేలా వందేభారత్ మెట్రోని తీసుకురావాలని ప్రధానమంత్రి సంకల్పించారని, దానికనుగుణంగా ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఇప్పటికే ఈ రైళ్లను తీసుకురావటం ద్వారా ప్రయాణీకుల నుంచి వచ్చే ఆదరణ పైన ప్రాజెక్టు రిపోర్టులను తెప్పించుకున్న రైల్వే అధికారులు అధ్యయనం చేసారు.
తెలుగు రాష్ట్రాల్లో వందే మెట్రో ఇలా
తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ రైలుకు ప్రస్తుతం సికింద్రాబాద్ - విశాఖపట్టణం మధ్య నడుస్తోంది. ఈ రైలుకు స్పందన బాగానే ఉంది. దీంతో..త్వరలో మూడు కొత్త వందే భారత్ రైళ్లు తెలుగు రాష్ట్రాల నుంచి అందుబాటులోకి తేనున్నారు. ముందుగా సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ త్వరలో ప్రారంభం కానుంది. ఇక.. కొత్తగా తీసుకొస్తున్న వందే మెట్రో రైళ్లకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో రెండు నగరాలకు అనుకూలంగా ఉంటాయని రైల్వే అధికారులు రిపోర్ట్ ఇచ్చినట్లు సమాచారం. నిత్యం హైదరాబాద్ నగరంలో రోజు వారీ పనుల మీద లక్షలాది మంది వస్తూ ఉంటారు. దీంతో, సికింద్రాబాద్ తో పాటుగా ఏపీలో తిరుపతి, విశాఖ నగరాలను ప్రతిపాదించినట్లు సమాచారం. తిరుపతి సమీప ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఇది అనుకూలంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ రైళ్లకు తుది ఆమోదం రావాల్సి ఉంది.