ఏపీలో వారంపాటు వర్షాలు: రైతులకు అలర్ట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్పపీడనం ప్రభావం కారణంగా మరో వారం రోజులపాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని.. రాగల 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. బుధవారం నాటికి శ్రీలంక-తమిళనాడు తీరాలకు చేరే అవకాశం ఉందని తెలిపింది.
ఈ నేపథ్యంలో డిసెంబర్ 15 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటని వర్షాలకు ముందు కోయవద్దని సూచించింది. కోసినా.. పూర్తిగా ఆరని పనలను వర్షాల నేపథ్యంలో కుప్పలు వేసేటప్పుడు ఎకరాకు 25 కిలోల ఉప్పును పనలపై చల్లుకుంటూ కుప్పవేసుకోవాలని.. దీంతో నష్ట శాతాన్ని నివారించుకోవచ్చని పేర్కొంది.
ఇక, వరి కోత కోసి పొలంలో ఉన్న పనలు వర్షానికి తడిచినట్లైతే గింజ మొలకెత్తకుండా ఉండటానికి ఉప్పు ద్రావణాన్ని పనలపై పడే విధంగా పిచికారీ చేయాలని సూచించింది. రైతులు పంట పొలాల్లో నిలిచే అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొంది. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలలో ఉంచాలని సూచించింది.
వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లకు ప్రభుత్వం సూచనలు చేసింది. జిల్లాల్లో కోసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశించింది. కల్లాల్లో ఉన్న ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని, వర్షాల్లో వరి కోతలు లేకుండా రైతులను అప్రమత్తం చేయాలని స్పష్టం చేసింది. ధాన్యం కుప్పలు వేయలేని చోట్ల రైతులకు టార్పిలిన్లు ఇవ్వాలని ఆదేశించింది.












Click it and Unblock the Notifications