కెసిఆర్కు డిఎస్ అమ్ముడుపోతారు: రాజలింగం
హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి కాంగ్రెసు పక్ష నేతగా డి. శ్రీనివాస్ ఎన్నికను ఆ పార్టీ ఎమ్మెల్సీ రాజలింగం తీవ్రంగా వ్యతిరేకించారు. డిఎస్పై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డి. శ్రీనివాస్ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు అమ్ముడుపోతారని ఆయన ఆరోపించారు. ఓటింగ్ లేకుండా కాంగ్రెసు పక్ష నేతను ఎలా ఎన్నుకుంటారని ఆయన ప్రశ్నించారు.
పార్టీ అధిష్టానం పేరు చెప్పి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రెండున్నరేళ్లలో డిఎస్ పది సార్లు కూడా మండలికి రాలేదని, డిఎస్ సమావేశాలకే రారని ఆయన అన్నారు. లాలూచీ పడి అధిష్టానం డబ్బున్నవారికే పదవులు ఇస్తోందని ఆయన విమర్శించారు.
డిఎస్ ఎన్నికను వ్యతిరేకించవద్దని పది లక్షల రూపాయలు పంపిస్తే తాను వెనక్కి పంపినట్లు ఆయన తెలిపారు. సీనియారిటీ పేరుతో అధిష్టానం పెద్దలు ప్రయోజనం లేని నాయకులకు పదవులు కట్టబెడుతోందని ఆయన అన్నారు.
ఎమ్మెల్సీల అభిప్రాయాలు తీసుకునే తనను ఎన్నుకున్నట్లు డిఎస్ తెలిపారు. తమ పార్టీ అధినేత సోనియా గాంధీని సంప్రదించిన తర్వాతనే తన ఎన్నికను ప్రకటించారని ఆయన చెప్పారు. తాను, షబ్బీర్ అలీ కలిసి పనిచేయాలని అధిష్టానం పెద్దలు నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్సీల మధ్య అభిప్రాయభేదాలు ఉన్నా కలుపుకుని పోతామని చెప్పారు. తెరాస ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటాలు చేస్తామని చెప్పారు.