కాంగ్రెసు వైఖరే అనుమానస్పదం: కెసిఆర్తో రాజ్నాథ్
న్యూఢిల్లీ: పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇస్తామని బిజెపి జాతీయాధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ హామీ ఇచ్చినట్లు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చెప్పారు. తెలంగాణ బిల్లుకు మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో భాగంగా ఆయన గురువారం రాజ్నాథ్ సింగ్ను కలిశారు. బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేసిన మేరకు తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వాలని తాను రాజ్నాథ్ సింగ్ను కోరినట్లు ఆయన తెలిపారు.
పార్లమెంటులో సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు వెల్లోకి వచ్చి నిరసన తెలియజేయడానికి ఓ పరిమితి ఉంటుందని, ఆ పరిమితి మేరకు మాత్రమే వారు వ్యవహరించాలని ఆయన అన్నారు. గతంలో తాను కూడా వెల్లోకి వెళ్లి నిరసన తెలియజేశానని, మీ నిరసన రికార్డు అయింది, సభ నడవడానికి సహకరించండని స్పీకర్ తనను అడిగితే వాకౌట్ చేసి వెళ్లిపోయానని ఆయన గుర్తు చేశారు.
పార్లమెంటులో నిరసన వ్యక్తం చేయడానికి ఓ పద్ధతి, పరిమితి ఉంటుందని ఆనయ అన్నారు. తెలంగాణ బిల్లుపై సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు సభలో మాట్లాడవచ్చునని, తమ నిరసనను తెలియజేయవచ్చునని, కానీ సభను అడ్డుకోవడం సరి కాదని ఆయన అన్నారు. వెల్లోకి దూసుకు వచ్చి సభను అడ్డుకునే పార్లమెంటు సభ్యుల విషయంలో స్పీకర్, వివిధ పార్టీల నాయకులు బాధ్యత తీసుకుని సరైన పద్ధతిలో వ్యవహరించి బిల్లును ఆమోదింపజేయాలని ఆయన కోరారు.
ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలు 60 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారని, బిల్లు ఆమోదం పొందకపోతే తెలంగాణ ప్రజలకు భారత ప్రజాస్వామ్యం నమ్మకం పోతుందని, ఇది ప్రమాకరమని, అందువల్ల తెలంగాణ బిల్లుకు బిజెపి మద్దతు ఇవ్వాలని తాను రాజ్నాథ్ సింగ్కు వివరించినట్లు కెసిఆర్ తెలిపారు. కెసిఆర్తో పాటు తెరాస నాయకులు రాజ్నాథ్ సింగ్ను కలిశారు.
తెలంగాణ విషయంలో కాంగ్రెసు వైఖరి అనుమానాస్పదంగా ఉందని, తెలంగాణ ఇవ్వాలని కాంగ్రెసుకు లేదని రాజ్నాథ్ సింగ్ అన్నట్లు బిజెపి అధికార ప్రతినిధి ప్రకాష్ జవదేకర్ అన్నారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనా తెలంగాణ ప్రక్రియ పూర్తి కాలేదని రాజ్నాథ్ సింగ్ అన్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ విషయంలో కాంగ్రెసు ద్వంద్వ నీతిని అనుసరిస్తోందని ఆయన విమర్శించారు. రెండు ప్రాంతాల నేతలను కాంగ్రెసు ప్రోత్సహిస్తోందని ఆయన అన్నారు.
ఏ ప్రాంతానికి కూడా కాంగ్రెసు న్యాయం చేయలేకపోతోందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సీమాంధ్ర నేతలు ఢిల్లీలో దీక్షలు చేసినా కాంగ్రెసు అధిష్టానం చర్యలు తీసుకోవడం లేదని ఆయన అన్నారు. కాంగ్రెసు ఎంపీలు సభను అడ్డుకుంటున్నా ఆ పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆయన అన్నారు. తెలంగాణ బిల్లుకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు.