రసగుల్లా.. ఎందుకీ హైరానా-జగన్ ను కలిస్తే టెన్షనా ? టీడీపీ పట్టాభికి వర్మ ఆడియో కౌంటర్
ఏపీ సీఎం వైఎస్ జగన్ ను తాజాగా టాలీవుడ్ దర్శక నిర్మాత రాంగోపాల్ వర్మ ఆయన క్యాంపు కార్యాలయానికి వచ్చి కలిశారు. అనంతరం వివరాలు వెల్లడించకుండానే హైదరాబాద్ వెళ్లిపోయిన వర్మ.. ఆ తర్వాత ట్విట్టర్ లో తాను త్వరలో రెండు రాజకీయ సినిమాలు తీస్తున్నట్లు వెల్లడించారు. తొలి చిత్రానికి వ్యూహం, రెండో చిత్రానికి శపథం అనే పేర్లు కూడా పెడుతున్నట్లు తెలిపారు. అయితే దీనిపై టీడీపీ నేత పట్టాభి తీవ్ర విమర్శలు గుప్పించారు.
టీడీపీ నేత పట్టాభి విమర్శలు వర్మను ఎక్కడో తాకాయి. దీంతో ఆయన ఇవాళ పట్టాభిపై సెటైర్లు వేస్తూ ఓ ఆడియో విడుదల చేశారు. ఈ ఆడియోలో పట్టాభిని ఓ రసగుల్లాగా వర్మ అభివర్ణించారు. అంతే కాదు జగన్ తో తాను భేటీ అయితే మీ పార్టీ వాళ్లందరినీ ఎందుకు భయపెడుతున్నావంటూ వర్మ ఆయన్ను ప్రశ్నించారు. ఏంటీ సడన్ గా బ్యాచ్ అంతా ఎందుకు హైరానా పడుతున్నారో అర్ధంకావడం లేదన్నారు. పట్టాభి బామా, బీమా తెలియదు.. రామ్ అనుకుంటా ఆయన పేరు అని వర్మ అన్నారు. ముద్దుగా, బొద్దుగా రసగుల్లాలా ఉంటాడని, ఒరేయ్ రసగుల్లా ముందు నేను జగన్ ను ఎందుకు కలిశానో తెలియకుండా అలా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు.
నేను బ్యాడ్ డైరెక్టర్, బ్యాడ్ సినిమా తీస్తానని అనుకుంటున్నప్పుడు నువ్వు హ్యాపీగా ఉండాలి కానీ టెన్షన్ ఎందుకని పట్టాభిని వర్మ ప్రశ్నించారు. రసగుల్లాలా చక్కెరలోనో, బెల్లంలోనో కూర్చుకుండా అంత హైరానా పడితే షుగర్, బీపీ ఎక్కువై చస్తావన్నారు. రసగుల్లా రసగుల్లాలా ఉండాలని, మిరపకాయలా యాక్ట్ చేయకూడదన్నారు. నీమీద కోపం లేదు, జాలేస్తోంది. నిన్ను చూస్తే బుగ్గ గిల్లాలనిపిస్తోంది. నేను మనిషి పేరు కానీ, సబ్జెక్ట్ కానీ చెప్పనప్పుడు, నీకు నువ్వే ఊహించేసుకుని మీ పార్టీ వాళ్లందరినీ భయపెట్టేస్తున్నావంటూ వర్మ మండిపడ్డారు. నీకు సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు, నాకు స్వీట్స్ అంటే ఇష్టం, అందుకే నాకు నచ్చావన్నారు.రసగుల్లా తర్వాత నీలా బొద్దుగా ముద్దుగా ఉన్న పదార్ధం నేను చూడలేదన్నారు. కాబట్టి స్వీటూ ఇంకో రెండు రసగుల్లాలు తిని ఇంట్లో కూర్చో అని సలహా ఇచ్చారు. నీ అవసరం నీ ఇంట్లో వాళ్లకు తప్ప ఇంకెవరికీ లేదు, కాబట్టి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో అన్నారు.