రవికిరణ్ అరెస్టు ఇష్యూ: జగన్కు మంచి చేసిందా? గతంలో కెసిఆర్పై ఇలా...
పొలిటికల్ పంచ్ నిర్వాహకుడు రవి కిరణ్ అరెస్టు జగన్కే కాకుండా చంద్రబాబుకు కూడా మంచే చేసినట్లు భావిస్తున్నారు. ఎలాగంటే...
విజయవాడ: పొలిటికల్ పంచ్ నిర్వాహకుడు ఇంటూరి రవి కిరణ్ అరెస్టు పలు విషయాలను ముందుకు తెచ్చింది. సోషల్ మీడియాలో అభిప్రాయాల వ్యక్తీకరణకు ఉన్న పరిమితులను, భావ ప్రకటనా స్వేచ్ఛకు ఉన్న హద్దులను అది గుర్తు చేసింది. సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి అపరిమితమైన స్వేచ్ఛ ఏదీ లేదనే విషయాన్ని గుర్తు చేసింది.
రవి కిరణ్ అరెస్టు వల్ల ఆ విషయం చాలా మందికి తెలిసి వచ్చింది. అసెంబ్లీ స్పీకర్ రికార్డుల నుంచి తొలగించిన విషయాలను రాస్తే శిక్షార్హమైన నేరం అవుతుందని తెలియని జర్నలిస్టులు ఉన్న ప్రస్తుత తరుణంలో రాజకీయ పార్టీల సోషల్ మీడియాను నిర్వహించే యాక్టివిస్టుల్లో చాలా మందికి అది తెలిసే అవకాశం కూడా లేదు.
రవి కిరణ్ చేసిన తప్పునకు అరెస్టు చేసిన పోలీసులు ఆయనను వదిలేశారు. రోజంతా తిప్పి చివరకు విడిచి పెట్టారు. సుప్రీం కోర్టు ఐటి చట్టంలోని 66ఎ సెక్షన్ను కొట్టేసింది. అయితే, అదే సమయంలో చర్యలు తీసుకోవడానికి అదే చట్టంలోని సెక్షన్ 67, ఐపిసిలోని సెక్షన్ 292లతో పాటు మరిన్ని కూడా కూడా ఉన్నాయి.
సెక్షన్ 19 (ఎ) ప్రకారం ప్రతి ఒక్కరికీ భావప్రకటనా స్వేచ్ఛ ఉంది. మీడియా కూడా ఈ దీనికి లోబడే వ్యవహరించాల్సి ఉంటుంది. మీడియాకు అంతకు మించిన హక్కులు ఏవీ లేవు. సోషల్ మీడియాలో వ్యక్తం చేయడానికి అపరిమితమైన హక్కులేమీ లేవు. రవికిరణ్ అరెస్టు ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
అనితపై వ్యాఖ్య చేస్తే...
రవి కిరణ్ ఓ కామెంట్లో ఎమ్మెల్యే అనితపై ఓ వ్యాఖ్య పెడితే దాని ఆధారంగా ఎస్సీ ఎస్టీ కేసు ఎందుకు పెట్టకూడదని పోలీసులు రవికిరణ్ను ప్రశ్నించారని సమాచారం. దానివల్ల తెలిసేదేమంటే, ఎవరో ఏదో వ్యాఖ్యను పోస్టు చేస్తే, దానిపై వ్యాఖ్య పెట్టిన వ్యక్తి పోస్టు హద్దులు మీరితే కేసులు పెట్టవచ్చుననేది రవికిరణ్ అరెస్టు ద్వారా తెలిసి వచ్చింది. కేవలం పోస్టులనే కాదు, వ్యాఖ్యల్లో వ్యక్తమయ్యే భాషను కూడా ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలిస్తోందని దీన్ని బట్టి అర్థమవుతోంది.
అందుకే రవికిరణ్ను వదిలేశారా...
రవి కిరణ్పై పోలీసులు కేసు పెట్టారు. అవి బెయిలబుల్ కేసులు. ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసుల్ోల ముందస్తు నోటీసు లేకుండా అరెస్టు చేస్తే, లేదా చూపిస్తే తర్వాత మానవ హక్కుల ఉల్లంఘన (41ఎ) కిద కేసుల బెడద పట్టుకుందనేది పోలీసులకు తెలుసు. అందుకే రవి కిరణ్ను వదిలేసినట్లు చెబుతున్నారు. అయితే, రవి కిరణ్కు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతు ఉంది కాబట్టి సరిపోయింది. సామాన్యులు పెడితే ఎలా ఉంటుందనే భయాన్ని కూడా ఆయన అరెస్టు చవి చూపించింది.
అన్ని పార్టీలకూ ఊన్నాయి...
అన్ని పార్టీలకు కూడా సోషల్ మీడియా విభాగాలున్నాయి. రాజకీయ ఉద్దేశ్యాలతోనే ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు, వ్యాఖ్యలు చేస్తుంటారు. విమర్శలు, ప్రతి విమర్శలు సాగుతుంటాయి. ఫొటోలను మార్ఫింగ్ చేసి పెట్టే అలవాటు కూడా ఉంది. అయితే, రవి కిరణ్ అరెస్టు వల్ల తమపై విమర్శలు తగ్గుతాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భావించి ఉండవచ్చు. లేదా ఆయన తరఫున నారా లోకేష్ అయినా అనుకుని ఉండవచ్చు. అందుకే రవి కిరణ్ను సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా ప్రచారం చేసేవారిని హెచ్చరించడానికే అరెస్టు చేసి ఉంటారని భావన వ్యక్తమవుతోంది.
జగన్కు మంచే జరిగింది..
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్కు అనుచరుల కన్నా అభిమానులు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. రవి కిరణ్ అరెస్టు ఒక రకంగా జగన్కు మంచే చేసిందని అంటున్నారు. కొన్ని వ్యవహారాల్లో ఆయన అభిమానులు పరిమితులు లేదా హద్దులు దాటిన సందర్భాలున్నాయి. కొందరి వ్యాఖ్యలు జగన్పై లేదా వైసిపిపై వ్యతిరేకతను పెంచే స్థాయికి వెళ్లాయని అంటారు. రవి కిరణ్ అరెస్టు వల్ల ఒళ్లు దగ్గర పెట్టుకుని పోస్టింగులు చేస్తారని, దానివల్ల జగన్కు మంచి జరుగుతుందని వాదిస్తున్నారు.
టిడిపీలోనూ ఉన్నారు...
టిడిపిలో కూడా వీరాభిమానులు ఉన్నారు. నియంత్రణ లేని వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టేవారున్నారు. టీడిపిలోని అలాంటి వారు కూడా రవి కిరణ్ ఉదంతంతో ఆత్మ విమర్శ చేసుకుని స్వయం నియంత్రణను పాటిస్తారని భావిస్తున్నారు. దానివల్ల చంద్రబాబుకు కూడా మేలు జరిగే అవకాశం ఉంటుంది. అర్థవంతమైన చర్చలు సోషల్ మీడియాలో జరిగితే అది అటు జగన్కే కాకుండా చంద్రబాబుకు కూడా మేలే జరుగుతుంది.
గతంలో తెరాస విషయంలో....
తెలంగాణలో ఓసారి కెసిఆర్, కవిత, కెటిఆర్ బొమ్మలు పెట్టి, గబ్బర్ సింగ్ పాటను తెలంగాణ కాంగ్రెసు కమిటీ పేరడీ చేసింది. అది ఎబ్బెట్టుగా ఉందనే విషయాన్ని సోషల్ మీడియా యాక్టివిస్టులు గుర్తించారు. దాంతో తెలంగాణ ప్రభుత్వంలోని కొద్ది మంది ఫోన్ చేసి ఆ పోస్టును వెనక్కి తీసుకోవాలని సూచించారు. వెంటనే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ బాధ్యులు ఆ పోస్టును డిలిట్ చేశారు.
అరెస్టు మంచే చేసింది..
రవి కిరణ్ అరెస్టు మొత్తంగా సోషల్ మీడియాలో చురుగ్గా ఉండేవారికి మేలే చేసింది. అపరిమితమైన ఆవేశంతో పోస్టులు పెట్టేవారికి హద్దులు మీర కూడదనే హెచ్చరికలను ఇచ్చింది. సోషల్ మీడియాలో కూడా భావ ప్రకటనా స్వేచ్ఛకు హద్దులు ఉంటాయని తెలియజేసింది. దానికి సంబంధించిన పరిమితులను తెలియజేసింది.