వైసీపీ హీరోలకు టాలీవుడ్ చెక్ - జగన్ తో భేటీకి గైర్హాజరు వెనుక ఏం జరిగింది ?
గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందే వైసీపీతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన టాలీవుడ్ ఆర్టిస్టులు పృధ్వీ, పోసాని కృష్ణమురళి, హీరో అలీ వంటి వారు నిన్న సీఎం జగన్ తో జరిగిన టాలీవుడ్ భేటీకి మాత్రం మొహం చాటేశారు. వీరికి ఆహ్వానం అందిందా లేదా అన్న విషయాన్ని పక్కనబెడితే పార్టీతో సత్సంబంధాలు కలిగిన టాలీవుడ్ ఆర్టిస్టులు కీలక భేటీకి స్కిప్ కావడం చర్చనీయాంశంగా మారింది.

జగన్ తో టాలీవుడ్ భేటీ....
ఏపీలో టాలీవుడ్ సినిమా షూటింగులతో పాటు పలు కీలక పెండింగ్ సమస్యల పరిష్కారం పేరుతో టాలీవుడ్ ప్రముఖులంతా నిన్న ఏపీ సీఎం జగన్ తో ఆయన క్యాంపు కార్యాలయానికి వచ్చి భేటీ అయ్యారు. ఇందులో చిరంజీవి, నాగార్జున, పీవీపీ, దిల్ రాజు, రాజమౌళి వంటి వారు ఉన్నారు. పిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ విజయ్ చందర్ కూడా వచ్చారు. జగన్ తో దాదాపు గంటసేపు భేటీ తర్వాత ఏపీలో షూటింగ్ లకు అనుమతి మాత్రమే వీరికి లభించింది. మిగతా సమస్యలపై చూద్దాం, చేద్దాం అన్న మాటలే సీఎం జగన్ నుంచి వినిపించాయి.

కీలక భేటీకి వారు డుమ్మా....
టాలీవుడ్ తరఫున సమస్యలు చెప్పుకోవడానికి ప్రముఖులంతా వస్తున్నారు. వీరితో పాటు పార్టీకి అనుబంధంగా, మద్దతుగా ఇన్నాళ్లూ వ్యవహరించిన పృధ్వీరాజ్, పోసాని కృష్ణమురళి, హీరో అలీ వంటి వారు వస్తారని అంతా భావించారు. కానీ చివరికి పార్టీ తరఫున కాకుండా సినీ ఇండస్ట్ర్రీ తరఫున నామినేటెడ్ పదవిలో ఉన్న విజయ్ చందర్ మాత్రమే జగన్ తో భేటీ లో కనిపించారు. వైసీపీకి మద్దతుగా గత ఎన్నికల్లో ప్రచారం చేయడంతో పాటు ఆ పార్టీ ప్రత్యర్దులపై విరుచుకుపడుతున్న పోసాని వంటి వారు కూడా ఈ భేటీలో కనిపించలేదు. దీంతో వీరికి ఆహ్వానం అందలేదా, అందినా వారు రాలేదా అన్న చర్చ సాగుతోంది.

ఇండస్ట్రీ విభేదాలే కారణమా ?
జగన్ సీఎం అయ్యాక తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరూ వచ్చి కనీసం అభినందనలు కూడా తెలపలేదని పృధ్వీ లాంటి వారు గతంలో బాధపడ్డారు. ఆ తర్వాత చిరంజీవి మాత్రమే వచ్చి కలిశారు. మిగతా వారంతా కలిసి రావడానికి ఏడాది సమయం పట్టింది. అదీ తమ అవసరాలు చెప్పుకోవడానికే తప్ప సీఎం జగన్ కు అభినందనలు చెప్పడానికి కాదు. గతంలో వైసీపీ తరఫున ప్రచారం చేసిన పృధ్వీ, అలీ, పోసాని వంటి వారికి ఇండస్ట్రీలో అవకాశాలు దాదాపుగా తగ్గిపోయాయి. వైసీపీతో అనుబంధంగా ఉంటున్నారన్న కారణంతో వీరిని టాలీవుడ్ పెద్దలు ఎప్పుడో పక్కనపెట్టేశారు. ఇలాంటి పరిస్ధితుల్లో సీఎం జగన్ తో భేటీకి వీరిని ఆహ్వానించి ఉండకపోవచ్చనే ప్రచారం సాగుతోంది.

జగనే వద్దన్నారా ?
సీఎం జగన్ తో నిన్న టాలీవుడ్ ప్రముఖుల సమావేశం తీరును గమనిస్తే ఇరుకైన గదిలోనే ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది. పరిమిత సంఖ్యలోనే టాలీవుడ్ పెద్దలు ఈ భేటీకి హాజరయ్యారు. ఇండస్ట్రీ ప్రతినిధులుగా సమస్యలు వినిపించడానికి మాత్రమే కాబట్టి ఎక్కువ మందికి సీఎంవో అనుమతి లభించకపోయి ఉండొచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. అందుకే ముందుగా అనుకున్న ఇండస్ట్రీ పెద్దలతో పాటు వైసీపీలో ఉన్న విజయ్ చందర్, పీవీపీ వంటి వారికే ఈ భేటీలో అవకాశం దక్కినట్లుచెబుతున్నారు.












Click it and Unblock the Notifications