పవన్ కళ్యాణ్ - రఘురామ ఫ్లెక్సీలు : నర్సాపురం టూర్ రద్దు - తిరిగి ఢిల్లీకి..!!
వైసీపీ రెబల్ ఎంపీ సంక్రాంతి పండుగ నర్సాపురంలో చేసుకోవాలని భావించారు. పండుగ నాడు సొంత నియోజకవర్గంలో ఉంటానని ప్రకటించారు. అందుకోసం ముందరోజునే హైదరాబాద్ చేరుకున్నారు. కానీ, చివరి నిమిషంలో నర్సాపురం పర్యటన రద్దయింది. రఘురామ రాజు తిరిగి ఢిల్లీ వెళ్లారు. నర్సాపురంలో రఘురామ రాజు వస్తున్నట్లుగా జిల్లా అధికారులకు సైతం సమాచారం ఇచ్చిన విషయాన్ని ఎంపీ స్వయంగా వెల్లడించారు. నర్సాపురం ప్రాంతంలో కొత్తగా కనిపిస్తున్న ఫ్లెక్సీలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
నర్సాపురంలో ఫ్లెక్సీలతో కొత్త చర్చ
పవన్ కళ్యాణ్ అభిమానులు తమ అభిమాన హీరోతో పాటుగా రఘురామ రాజు ఫొటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఫిబ్రవరి 5 తరువాత రఘురామ తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని..తాను ఎన్నికల్లో పోటీ చేసి ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత ఏంటో నిరూపిస్తానని సవాల్ చేసారు. తన పైన అనర్హత వేటు వేసేందుకు ప్రయత్నాలు చేసుకోవాలంటూ వైసీపీకి ఛాలెంజ్ చేసారు. ఇదే సమయంలో రఘురామ హైదరాబాద్ రాగానే సీఐడి అధికారులు గత కేసులోనే మరోసారి నోటీసులు ఇచ్చారు.
నర్సాపురం పర్యటన రద్దు
ఈ నెల 17వ తేదీన గుంటూరు సీఐడీ కార్యాలయంలో విచారణకు రావాలని అందులో సూచించారు. తాను విచారణకు హాజరవుతానని రఘురామ వెల్లడించారు. తొలుత నర్సాపురం వెళ్లాలని భావించినా.. నోటీసుల వ్యవహారంలో ఆయన టూర్ రద్దయింది. తిరిగి ఢిల్లీ వెళ్లారదు. అక్కడ నోటీసుల వ్యవహారం పైన న్యాయవాదులతో చర్చలు చేయాల్సి ఉందని.. ఎవరూ ఏయిర్ పోర్టు రావద్దంటూ సూచించారు.
ఇక, నర్సాపురం బై పోల్ లో తాను గెలవటం ఖాయమని చెబుతున్న రఘురామ.. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది మాత్రం స్పష్టత ఇవ్వలేదు. అన్ని పార్టీలు.. అన్ని వర్గాల ప్రజలు తనకు మద్దతుగా నిలవాలంటూ రఘురామ పిలుపునిచ్చారు. దీనికి కొనసాగింపుగా తాను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పుకొచ్చారు.
Recommended Video
గెలుపు ఖాయం.. మెజార్టీ కోసమేనంటూ
తన గెలుపు ఖాయమని చెబుతున్న రఘురామ.. మెజార్టీ పైనే తాను ఫోకస్ చేస్తున్నట్లు చెప్పారు. అమరావతి నినాదంతో పోటీ చేయాలని నిర్ణయించిన రఘురామ... బీజేపీ - టీడీపీ - జనసేన మద్దతు తనకు లభిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. దీంతో..నేరుగా బీజేపీ ననుంచి కాకుండా జనసేన నుంచి పోటీ చేసినట్లయితే నర్సాపురం సామాజిక సమీకరణాలు సైతం తనకు కలిసివస్తాయనే లెక్కలతో ఉన్నట్లుగా చెబుతున్నారు.
కాగా, ఇప్పుడు నర్సాపురం పరిధిలో కనిపిస్తున్న ఫ్లెక్సీలతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. అయితే, ఆయన పోటీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది..రాజీనామా తరువాతనే స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.