వైసీపీ అధ్యక్ష పదవికి రఘురామ-ఎన్నికలకు డిమాండ్-అనర్హత కొట్టేయాలని స్పీకర్ కు లేఖ
ఏపీలో వైసీపీ వర్సెస్ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుగా సాగిపోతున్న పోరులో ఇవాళ మరో కొత్త ట్విస్ట్ ఎదురైంది. వైసీపీ అధినేత జగన్ పై ఇన్నాళ్లూ విమర్శలు చేస్తున్న రఘురామ ఇప్పుడు ఏకంగా ఆయనపై పోటీకే దిగుతానంటూ కొత్త సవాల్ విసిరారు. పార్టీలో సంస్ధాగత ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. పార్టీ అధ్యక్ష పదవికి తాను పోటీపడతానన్నారు. అదే సమయంలో వైసీపీ తనపై ఇచ్చిన అనర్హత వేటు ఫిర్యాదుపై స్పందించి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
జగన్ వర్సెస్ రఘురామ
ఏపీలో వైసీపీ అధినేత కమ్ సీఎం జగన్, రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మధ్య సాగుతున్న వార్ దాదాపు రెండేళ్లు పూర్తి చేసుకుంటోంది. ఈ మధ్య కాలంలో జగన్ ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ రఘురామ పలు సందర్భాల్లో లేఖలు రాయడంతో పాటు నేరుగా ప్రెస్ మీట్లు పెడుతూ సంచలన వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. అలాగే జగన్ తో పాటు వైసీపీ కీలక ఎంపీ విజయసాయిరెడ్డి బెయిళ్లు రద్దు చేయాలని కోరుతూ సీబీఐ కోర్టును ఆశ్రయించి భంగపడ్డారు కూడా. అయినా వైసీపీ అధినేతపై రఘురామ పోరు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.
వైసీపీ అధ్యక్ష పదవికి రఘురామ పోటీ
వైసీపీ అధినేతగా సీఎం జగన్ ఉన్నారు. పార్టీ నెలకొల్పిన నాటి నుంచి ఆయన ఎన్నిక ఏకగ్రీవమవుతూనే ఉంది. ఇలాంటి పరిస్ధితుల్లో వైసీపీలో సంస్ధాగత ఎన్నికల గురించి ఎవరూ మాట్లాడే పరిస్ధితి లేదు. దీంతో అదే విషయాన్ని పట్టుకుని ఇవాళ రఘురామ ట్విస్ట్ ఇచ్చారు. వైసీపీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ మేరకు సంస్ధాగత ఎన్నికలు నిర్వహించాలని రఘురామ డిమాండ్ చేశారు. పార్టీలో అధ్యక్ష పదవికి ఎవరైనా పోటీ చేయొచ్చంటూ రఘురామ వ్యాఖ్యానించారు. తద్వారా జగన్ పై తాను పోటీ చేస్తానని చెప్పకనే చెప్పారు.
పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనపై
వైసీపీలో తరచూ క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న రఘురామ ఇవాళ ఈ విషయంపై స్పందించారు. తాను పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించలేదన్నారు. క్రమశిక్షణ గల కార్యకర్తను కాబట్టే తనను పార్టీలో నుంచి తొలగించలేదన్నారు. కానీ వైసీపీ నేతలు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని రఘురామ మండిపడ్డారు. వాస్తవానికి వైసీపీ లోక్ సభ స్పీకర్ కు ఇచ్చిన ఫిర్యాదులో రఘురామ పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ ప్రధానంగా ఫిర్యాదు చేసింది. కానీ ఆరోపణను రఘురామ ఖండించారు.
అనర్హత వేటు కొట్టేయాలని స్పీకర్ లేఖ
అలాగే తనపై వైసీపీ నేతలు లోక్ సభ స్పీకర్ కు చేసిన అనర్హత వేటు ఫిర్యాదుపైనా రఘురామ స్పందించారు. ఇప్పటికే తనపై అనర్హత వేటు ఫిర్యాదు దాఖలై చాలా రోజులు గడిచిన నేపథ్యంలో దీనిపై ఎలాంటి నిర్ణయం వెలువడకపోవడాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఈ ఫిర్యాదును కొట్టేయాలని లోక్ సభ స్పీకర్ కు ఓ లేఖ రాశారు. ఇప్పటికే రఘురామకు ఈ వ్యవహారంపై లోక్ సభ స్పీకర్ నోటీసులు జారీ చేయడం, ఆయన దానికి వివరణ ఇవ్వడం కూడా జరిగిపోయాయి. అదే సమయంలో అనర్హత వేటు వ్యవహారాన్ని వైసీపీ కూడా లైట్ తీసుకుంది. ఈ నేపథ్యంలో రఘురామ లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది.