మొన్న తెలంగాణలో నేడు ఏపీలో.. స్కూల్ లో విద్యార్థులతో టీచర్ క్షుద్ర పూజలు
స్కూల్ లోకి దెయ్యాలు వస్తున్నాయని తెలంగాణా రాష్ట్రంలోని వరంగల్ రూరల్ జిల్లాలో ఒక స్కూల్ లో ప్రిన్సిపల్ క్షుద్ర పూజలు చేయించిన ఘటన మరువక ముందే ఏపీలో ఒక స్కూల్లో ఉపాధ్యాయుడు అదే దారుణానికి పాల్పడ్డాడు . మూఢనమ్మకాలు వద్దు అని చెప్పి అందరిలో సామాజిక స్పృహను కల్పించాల్సిన ఉపాధ్యాయుడే స్కూల్లో క్షుద్రపూజలు చేయించిన ఘటన తాజాగా కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలంలోని సి.వడ్డెపల్లి స్కూల్లో చోటుచేసుకుంది.
కడప జిల్లాలోని ఓ స్కూల్ లో క్షుద్ర పూజలు చేయించిన టీచర్
ఇక అసలు విషయానికి వస్తే కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలంలోని సి.వడ్డెపల్లి స్కూల్లో చదువుతున్న ఓ విద్యార్థిని చెవికమ్మలు పోయాయి. ఆ విషయం తెలుసుకున్న రవి కుమార్ అనే ఉపాధ్యాయుడు చెవి కమ్మలు తీసిన వారిని కనిపెట్టేందుకు క్షుద్రపూజలు చేయించాలనుకున్నాడు. మంత్రగాడిని పిలిపించి అంజనం వేయిస్తే దొంగ దొరుకుతారని భావించి స్కూల్ లోనే ఏకంగా ఆ పని చేశారు . ఇక దొంగను పట్టుకోటానికి ఆదివారం తలస్నానం చేసి అందరూ స్కూలుకు రావాలని విద్యార్థులకు చెప్పాడు. దీంతో విద్యార్థులందరూ స్కూలుకు వెళ్లారు.
ఒక విద్యార్థిని చెవి పోగుల దొంగను పట్టుకునేందుకు స్కూల్ లో క్షుద్రపూజలు
టీచర్ రవి కుమార్ రమణ అనే మంత్రగాడిని తీసుకొచ్చి విద్యార్థుల చేతి గోళ్లపై పసరు రాయించి పూజ ప్రారంభించాడు. ఈ తతంగం జరుగుతుండగానే ఓ విద్యార్థి తాత స్కూలుకు వచ్చి అక్కడ జరుగుతున్న తతంగాన్ని చూసి ఉపాధ్యాయుడిని నిలదీశారు . అసలు ఇక్కడ ఏం జరుగుతుందంటూ టీచర్ రవి కుమార్ను ప్రశ్నించాడు. దీంతో వారిద్దరు కాస్త కంగారు పడ్డారు. మరోవైపు విషయం తెలిసిన గ్రామస్థులు అక్కడకు చేరుకున్నారు. భయపడిన మంత్రగాడు రమణ పరారయ్యాడు.
టీచర్ పై గ్రామస్తుల ఆగ్రహం..కేసు నమోదు
ఇక ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు ఆ తరువాత ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు . అక్కడికి చేరుకున్నపోలీసులు రవి కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. తమకు ఏదో ఆకు పసరు పూశారని, ఆ తర్వాత తల తిరిగినట్టు అయిందని విద్యార్థులు తెలిపారు. టీచర్ చేసిన పనికి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇక ఈ విషయంపై ఎంఈవో చక్రేనాయక్ ఈ ఘటనపై విచారణ జరిపించి ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఉపాధ్యాయులే మూఢ నమ్మకాలను పెంచి పోషిస్తే ఎలా?
ఎక్కడైనా చదువు లేని వారు దెయ్యాలు, భూతాలూ, దొంగలను పట్టుకోవటానికి మంత్ర ,తంత్రాలను ఆశ్రయించారు అంటే ఓకే కానీ చదువుకుని పది మందికి విద్యాబోధన చేసే వృత్తిలో ఉన్న వాళ్ళే మూఢ నమ్మకాలను విశ్వసించటం మాత్రం దారుణం . ఎక్కడైనా చదువుకుంటే మూఢ నమ్మకాలు పోతాయి. విద్యార్థులకు స్కూల్స్ లో టీచర్లు కూడా మూఢ నమ్మకాలను పోగొట్టేందుకు ప్రయత్నం చెయ్యాలి . అయితే, బడులే మూఢ నమ్మకాలను పెంచి పోషిస్తుంటే విద్యార్థుల పరిస్థితి ఏంటి అన్న భావన కలగక మానదు .ఇక ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే .