జగన్ సర్కార్ కు భారీ ఊరట-ఐదుగురు ఐఎఎస్ లకు శిక్ష తీర్పు కొట్టేసిన హైకోర్టు డివిజన్ బెంచ్
ఏపీ హైకోర్టులో వరుస ఎదురుదెబ్బలతో విమర్శల పాలవుతున్న వైసీపీ సర్కార్ కు ఇవాళ భారీ ఊరట దక్కింది. ప్రభుత్వంలో సేవలందించిన ఐదుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష విధిస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ గతంలో ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్ ఇవాళ కొట్టేసింది. దీంతో ఈ ఐదుగురు అధికారులతో పాటు ప్రభుత్వానికీ భారీ ఊరట దక్కినట్లయింది.
గతంలో భూసేకరణ సందర్భంగా పరిహారం చెల్లింపు విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఐఏఎస్ అధికారులు మన్మోహన్ సింగ్, ముత్యాలరాజు, శేషగిరిబాబు, కేవీఎన్ చక్రధర్ బాబు అమలు చేయలేదని నిర్ధారించిన హైకోర్టు సింగిల్ బెంచ్ వారికి జైలుశిక్ష విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీనిపై సదరు ఐఏఎస్ అధికారులు తిరిగి హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. విచారణలో హైకోర్టు పలు కీలక అంశాల్ని పరిగణనలోకి తీసుకుంది.
తమపై దాఖలైన కోర్టు ధిక్కార కేసులో హైకోర్టు సింగిల్ బెంచ్ న్యాయమూర్తి ఇచ్చిన ఆదేశాలను సవాలే చేస్తూ ఐఏఎస్ అధికారులు దాఖలు చేసిన అప్పీళ్లపై డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. ఈ సందర్భంగా భూసేకరణ బాధితులకు పరిహారం అందించడంలో పిటిషనర్లు విఫలం కాలేదని నిర్ధారించింది. ఇప్పటికే వారికి పరిహారం అందినట్లు జారీ చేసిన ఉత్తర్వులను పిటిషనర్లు కోర్టుకు సమర్పించారు. దీంతో వీరి వాదనతో ఏకీభవించిన డివిజన్ బెంచ్ పిటిషనర్లు హైకోర్టు గతంలో జారీ చేసిన ఆదేశాలను అమలు చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేసినట్లు నిర్ధారణకు వచ్చింది. దీంతో వీరికి విధించిన జైలు శిక్షను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది.
Recommended Video
ఇప్పటికే వైసీపీ సర్కార్ లో పలువురు అఖిల భారత సర్వీసు అధికారులపై కోర్టు ధిక్కార కేసులు కొనసాగుతున్నాయి. వీటిలో కొందరికి శిక్షలు కూడా పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఐదుగురు ఐఏఎస్ లపై శిక్ష పడింది. అయితే హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుతో వీరితో పాటు ప్రభుత్వానికి కూడా ఊరట దక్కిందని చెప్పవచ్చు. ఇప్పటికే ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాదాపు 8 వేల కోర్టు ధిక్కార పిటిషన్లు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఇందులో కీలకమైన ఐఏఎస్ అధికారులపై వచ్చిన సానుకూల తీర్పుపై ప్రభుత్వ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.