కేసీఆర్ కు షాక్ ; జగన్ సర్కార్ కు రిలీఫ్ : ఆ నిధులు వారంలోగా ఏపీకి ; తెలంగాణాకు సుప్రీం డెడ్ లైన్ !!
ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజన పంచాయితీలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా తెలుగు అకాడమీ ఆస్తుల విషయంలో సుప్రీం ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వానికి కీలక ఆదేశం ఇచ్చింది. తెలుగు అకాడమీ విభజనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వాల్సిన డబ్బులు వారంరోజుల్లో బదిలీ చేయాలని జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. సుప్రీం ఆదేశంతో జగన్ సర్కార్ కు బిగ్ రిలీఫ్ దొరికినట్లు అయ్యింది. సుప్రీం కోర్టు తెలంగాణా విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోకపోవటంతో కేసీఆర్ కు షాక్ తగిలిందని చెప్పాలి . వారం రోజుల్లో నిధులు బదిలీ చెయ్యాలని డెడ్ లైన్ విధించటం తెలంగాణా సర్కార్ కు మింగుడు పడటం లేదు.
ఏపీ తెలంగాణా విద్యుత్ బకాయిల రగడ : తెలంగాణా బకాయిల కోసం కోర్టు మెట్లెక్కిన ఏపీ ; ఎవరివాదన వారిదే !!
వారమే డెడ్ లైన్ .. ఏపీ తెలుగు అకాడమీ నిధులు చెల్లించండి.. తెలంగాణాకు సుప్రీం ఆదేశం
ఈ కేసు విచారణ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వవలసిన నిధులను ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేయలేదని ఏపీ ప్రభుత్వం సుప్రీం ధర్మాసనం దృష్టికి తీసుకు వెళ్ళింది. ఈ క్రమంలో తాము రెండు వారాల్లో డబ్బులు బదిలీ చేస్తామని మరికొన్ని డాక్యుమెంట్లను కూడా అందజేస్తామని తెలంగాణ తరఫు న్యాయవాది సుప్రీం ధర్మాసనాన్ని సమయం కోరారు. అయితే రెండు వారాల సమయాన్ని అంగీకరించని కోర్టు, కేవలం ఒక వారం గడువు ఇచ్చి వారం రోజుల్లో డబ్బులు బదిలీ చేయాలని ఆదేశం ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం విభజన చట్టం ప్రకారం తమకు స్థిరాస్తులలోనూ వాటా వస్తుందని వాదించగా ముందుగా చరాస్తులు, బ్యాంకు నిధుల పంపిణీ అంశాలను పరిష్కరించుకోవాలని, ఆ తర్వాత స్థిరాస్థులు వ్యవహారాన్ని చూద్దామని జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు.
విశ్రాంత న్యాయమూర్తితో అకాడమీ విభజనకు కమిటీ వెయ్యాలని కోరిన ఏపీ .. ససేమిరా అన్న తెలంగాణా
ఇప్పటికే అనేకమార్లు తెలుగు అకాడమీకి సంబంధించి ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రావాలని సూచించిన సుప్రీం ధర్మాసనం, మరోమారు ఇరు రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. ఇక అకాడమీ స్థిరాస్తులకు సంబంధించిన తదుపరి విచారణను మూడు వారాలపాటు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. విచారణ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు అకాడమీ కి సంబంధించి ఆస్తుల పంపకాల పై విశ్రాంత న్యాయమూర్తితో కమిటీ వేయాలని విజ్ఞప్తి చేయగా, తెలంగాణ ప్రభుత్వం దీనికి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పటివరకు పంపకాల విషయంలో అనుసరిస్తున్న విధానాన్ని సుప్రీం ధర్మాసనం దృష్టికి తీసుకు వెళ్ళింది.
సిబ్బంది జీతాల విషయంలో తెలంగాణా హైకోర్టులో కేసు
తెలుగు అకాడమీ విభజన అంశం తెలంగాణ తీరుతో పరిష్కారం కావడం లేదని తెలుగు అకాడమీలో ఏపీ పరిధిలోని ప్రాంతీయ కేంద్రాల్లో పనిచేస్తున్న రోజువారీ ఒప్పంద సిబ్బంది 2018 డిసెంబర్ నుండి తమకు జీతాలు రావడం లేదని తెలంగాణ హైకోర్టు మెట్లెక్కడంతో విభజన పంచాయితీ కోర్టు వేదికగా మొదలైంది. 2018 డిసెంబర్ నుండి తమకు వేతనాలు అందడం లేదని ఉమ్మడి అకాడమీని విభజిస్తే తమకు న్యాయం జరుగుతుందని ఏపీ పరిధిలోని తెలుగు అకాడమి ప్రాంతీయ కేంద్రాల్లో పనిచేస్తున్న రోజువారి , ఒప్పంద సిబ్బంది తెలంగాణ హైకోర్టులో 2020 నవంబర్లో పిటిషన్ దాఖలు చేశారు.
హైకోర్టు నెలరోజుల్లో కేటాయింపులు, మూడు నెలల్లో విభజన పూర్తి చెయ్యాలని తీర్పు
దీనిపై జనవరిలో జస్టిస్ రామచంద్రరావు జస్టిస్ అమర్నాథ్ గౌడ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా తెలుగు అకాడమీ విభజనకు రెండు నెలల్లో మార్గదర్శకాలను రూపొందించుకోవాలని ఆ తరువాత నెల రోజులలోకేటాయింపులు పూర్తిచేయాలని ధర్మాసనం తీర్పునిచ్చింది.అంతేకాదుసిబ్బందికి చెల్లించాల్సిన వేతనాలు,పిటిషనర్లకుఅసౌకర్యం కలిగించినందుకు 17 మందికి మూడు వేల చొప్పున చెల్లించాలని ఆదేశించింది. మొత్తంగా మూడు నెలల్లో అకాడమీ విభజన పూర్తి చేయాలనితెలంగాణ హైకోర్టు ఆదేశించింది.
తెలంగాణా హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన తెలంగాణా ప్రభుత్వం .. గతంలో సుప్రీం నోటీసులు
తెలంగాణా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలనువ్యతిరేకించిన తెలంగాణా ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. తెలంగాణ ప్రభుత్వంతెలుగు అకాడమీ విభజన అంశం న్యాయ పరిధిలోకి రాదని,దీనిపై తెలంగాణ హైకోర్టు ఏ విధంగా ఆదేశాలు జారీచేస్తుంది అంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో తెలుగు అకాడమీ ఉద్యోగులు ,ఆస్తులు ,అప్పుల పంపకాలపై గతంలో సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా ధర్మాసనం ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రావాలని, లేదంటే ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకొని, విచారణ జరుపుతామని గతంలో ఓ మారు నోటీసులు జారీ చేసింది. అయినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రాకపోవడంతో తాజాగా విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం ఏపీకి ఇవ్వాల్సిన డబ్బులు వారం రోజుల్లో బదిలీ చేయాలని తెలంగాణా సర్కార్ కు ఆదేశాలు జారీ చేసింది.
సుప్రీం ఆదేశాలతో తెలంగాణాకు షాక్ .. ఏపీకి రిలీఫ్ ..
మరి సుప్రీం ఆదేశాల నేపధ్యంలో తెలంగాణా సర్కార్ తెలుగు అకాడెమీ విభజనకు సంబంధించిన నిధులు ఏపీ ప్రభుత్వానికి బదిలీ చేస్తుందా ? ఏం చెయ్యబోతుంది అనేది తెలియాల్సి ఉంది. ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టును ఆశ్రయించిన తెలంగాణా ప్రభుత్వానికే సుప్రీం కోర్టు పెద్ద ఝలక్ ఇచ్చింది. మరి చరాస్తుల విషయంలో ఇప్పటికే అనేక శాఖల పరిధిలో ఉన్న ఆస్తులను కూడా ఇవ్వకుండా ససేమిరా అంటున్న తెలంగాణా ప్రభుత్వానికి అకాడెమీ స్థిర ఆస్తుల విషయంలో మళ్ళీ జరగనున్న విచారణలో సుప్రీం ధర్మాసనం ఏం తీర్పు చెప్తుందో అన్న ఆందోళన మొదలైంది. ఇప్పటి వరకు అనేక విభజన పంచాయితీలు కొలిక్కి రాకుండా ఇబ్బంది పడుతున్న ఏపీకి తాజా సుప్రీం నిర్ణయం కొంత మేర ఊరట నిచ్చిందని చెప్పొచ్చు.