రిటైల్ పాలసీ తెస్తాం: రిటైల్ మార్కెట్ ప్రతినిధులతో కెసిఆర్
హైదరాబాద్: సింగిల్ విండో పారిశ్రామిక విధానం తరహాలోనే రిటైల్ మార్కెట్ పాలసీని రూపొందిస్తామని రిటైల్ మార్కెట్ ప్రతినిధులకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో రిటైల్ మార్కెట్ ప్రతినిధులు శుక్రవారం సమావేశమయ్యారు. ప్రణాళిక ప్రకారం రిటైల్మార్కెట్లను విస్తరించాలని సూచించారు. రిటైల్ మార్కెటింగ్కు అవసరమైన స్థలాన్ని కేటాయించేలా చూస్తామని తెలిపారు.
మాల్స్ ఉద్యోగులకు వారానికి ఒక రోజు సెలవు ఇవ్వాలని రిటైల్ మార్కెట్ ప్రతినిధులకు సీఎం కేసీఆర్ సూచించారు. పాలసీ రూపకల్పన కోసం రిటైల్ మార్కెట్ నిర్వాహకులు, జిహెచ్ఎంసి అధికారులు, రిటైల్ ఎస్టేట్ వ్యాపారులతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తామని కెసిఆర్ చెప్పారు. రాత్రి వేళల్లో విధులు నిర్వహించే మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.
మాల్స్లో ఉద్యోగులకు వారానికి ఓ రోజు సెలవు ఇచ్చేలా చూడాలని ఆయన చెప్పారు. 365 రోజులు వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించాలని వ్యాపారులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఇదిలావుంటే, హైదరాబాదులోని హనుమాన్ వ్యాయామశాఖ స్థలం రిజిస్ట్రేషన్కు ప్రభుత్వం అంగీకరించింది. హనుమాన్ వ్యాయామ శాఖ పేరుతోనే రిజిస్ట్రేషన్ చేయాలని ఆయన అధికారులకు సూచించారు.
కెసిఆర్ శుక్రవారం సాయంత్రం కేరళకు బయలుదేరి వెళ్లారు. శనివారం త్రిసూరులో జరిగే వివాహ వేడుక కార్యక్రమానికి ఆయన హాజరవుతారు. ఆ తర్వాత కేరళలోని అటవీ పరిశోధనా కేంద్రాన్ని సందర్శిస్తారు.
గవర్నర్తో జగదీష్ రెడ్డి బేటీ
రాష్ట్ర గవర్నర్ నరసింహన్తో తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీష్రెడ్డి శుక్రవారం ఉదయం రాజ్భవన్లో సమావేశమయ్యారు. ఇరు రాష్ర్టాల మధ్య నెలకొన్న ఎంసెట్ వివాదంపై చర్చించారు. ఈ అంశంపై గత రెండు రోజుల క్రితం జరిగిన భేటీలో ఎలాంటి స్పష్టత లేకుండా ముగిసింది. ఎంసెట్కు చైర్మన్గా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తుందని, మిగిలిన వ్యవహారాలన్నీ ఏపీ ప్రభుత్వం చూడాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వం అంగీకరించకపోవడంతో వివాదం మొదటికి వచ్చింది.
ఈ నేపథ్యంలో ఇరు రాష్ర్టాల విద్యాశాఖ మంత్రులతో గవర్నర్ నరసింహన్ పదేపదే సమావేశమై వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా గవర్నర్ ఆదేశాల మేరకు మంత్రి జగదీష్రెడ్డి శుక్రవారం భేటీ అయి ఈ అంశంపై చర్చించారు. గవర్నర్తో భేటీ తర్వాత జగదీష్ రెడ్డి ముఖ్యమంత్రి కెసిఆర్తో సమావేశమయ్యారు. గవర్నర్తో జరిగిన సమావేశం వివరాలను ఆయన కెసిఆర్కు వివరించినట్లు సమాచారం.