కథలు చెప్పావ్, మీవాళ్లు సన్నాసులా: కెసిఆర్పై రేవంత్
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు రేవంత్ రెడ్డి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన సోమవారం నిప్పులు చెరిగారు. దళితులకిచ్చిన హామీని కెసిఆర్ కాలరాశారని ఆరోపించారు. కెసిఆర్ కేబినెట్లోని 12 మందిలో ముగ్గురు ఆయన కుటుంబానికి చెందినవారేనని ధ్వజమెత్తారు.
గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తానన్న కేసీఆర్ ఒక్క మంత్రి పదవినీ ఇవ్వలేదన్నారు. ఆస్తులకు పంచుకున్నట్లు మంత్రి పదవులను కెసిఆర్ కుటుంబ సభ్యులు పంచుకున్నారన్నారు. మంత్రివర్గ కూర్పులో పాలమూరు జిల్లాకు ఎందుకు ప్రాతినిథ్యం కల్పించలేదని ప్రశ్నించారు.
పాలమూరు ప్రజలు కేసీఆర్ను పార్లమెంటుకు పంపించారని, ఆయన ఎప్పుడు వస్తాడో, ఎక్కడుంటారో, ఎక్కడ చస్తాడో తెలియకున్నా ప్రజలు ఆయనను గెలిపించారన్నారు. పాలమూరు ప్రజలు ఓట్లేస్తే గద్దెనెక్కిన కెసిఆర్.. మొదటి నుండి తెలంగాణ ఉద్యమం సమయంలో పాలమూరు వలసల గురించి, కష్టాల గురించి కథలు కథలు చెప్పారని, ఇప్పుడు గద్దెనెక్కి మంత్రివర్గంలో చోటు ఎందుకు కల్పించలేదన్నారు.
పాలమూరు జిల్లాలో 14 మంది శాసన సభ, 2 పార్లమెంటు స్థానాలు ఉంటే.. అందులో సగం వాటిలో తెరాసను ప్రజలు గెలిపించారన్నారు. జిల్లాలో యాభై శాతం మందిని తెరాస నుండి గెలిపిస్తే ఒక్కరికి కూడా కేబినెట్లో ఎందుకు చోటివ్వలేదన్నారు. పాలమూరు నుండి గెలిచిన తెరాస ప్రజాప్రతినిధులను కెసిఆర్.. సన్నాసులు, దద్దమ్మలుగా భావిస్తున్నారా అన్నారు. ఏ ఒక్కరి పాలమూరు నుండి మంత్రి పదవికి అర్హులు కాదా చెప్పాలన్నారు.
అన్నింటా వెనుకబడిన పాలమూరుకు ఎలా అన్యాయం చేయబుద్ది అయిందని ప్రశ్నించారు. సీమాంధ్ర వివక్ష పైన మాట్లాడే కెసిఆర్... మామా అల్లుళ్లు మంత్రి పదవులు తీసుకొని, మిగతా జిల్లాలకు అన్యాయం చేసినప్పుడు వివక్ష గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఆస్తులు పంచుకున్నట్లు మంత్రి పదవులను కెసిఆర్ కుటుంబ సభ్యులు పంచుకున్నారన్నారు. రాజముద్ర వెనుక కెసిఆర్ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. చిహ్నంలో అమరవీరుల స్థూపమేదని ప్రశ్నించారు.
అమరవీరుల బలిదానాన్ని శాశ్వతంగా మరుగుపరిచే ప్రయత్నాలు చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రాజముద్ర పైన మరోసారి పరిశీలన చేయాలన్నారు. కెసిఆర్కు గిరిజనులు, మహిళలు కనిపించలేదా అన్నారు. పాలమూరు నేతలకు కేబినెట్లో అవకాశం లేకుంటే తాము జిల్లాలో కెసిఆర్ను తిరగనివ్వమన్నారు. తమకు కెసిఆర్ నుండి ఆహ్వానం అందలేదని చెప్పారు.
ఉద్యమంతో సంబంధం లేని పలువురికి కేబినెట్లో చోటు ఇచ్చారన్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధులను ఆహ్వానించక పోవడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరాంకు కూడా ప్రాధాన్యత ఇవ్వక పోవడం నిజం కాదా అన్నారు. శ్రీకాంత చారి తల్లికి కేబినెట్లో చోటు కల్పిస్తే బాగుండేదన్నారు.