టీడీపీ ఉంటే బాబు దూకుడుండదు!: రేవంత్ కొత్తవాదన
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి ఆశ్చర్యకరమైన వాదన తెర పైకి తెచ్చారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో టీడీపీ ఉనికి ఉంటేనే లాభమని, ఇక్కడ పార్టీని బతికించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణతో ఉన్న వివాదాల్లో దూకుడుగా వెళ్లడం లేదని వ్యాఖ్యానించారు.
ఒకవేళ తెలంగాణలో టీడీపీ లేకపోతే చంద్రబాబు ఏపీ ప్రయోజనాలే చూసుకునే వారన్నారు. కేసీఆర్ దృష్టి పెట్టాల్సింది వలసల పైన కాదని, తెలంగాణ సమస్యల పైన అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేల ఇళ్ల ముందు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు రోజూ వెళ్లి కూర్చుంటున్నారని, తెరాసలో చేరాలని ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు.
కేసీఆర్, కిషన్ రెడ్డిల భేటీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిలు మంగళవారం శాసన సభలో దాదాపు గంటసేపు మాట్లాడుకున్నారు. బడ్జెట్ ప్రసంగం పైన చర్చ సాగుతున్న సమయంలో కేసీఆర్ వద్దకు కిషన్ వచ్చారు. పలు అంశాల పైన ఇద్దరు చర్చించుకున్నారు.
మా కాదు.. మన ముఖ్యమంత్రి
ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మంగళవారం సభలో మాట్లాడుతూ పలుమార్లు మా ముఖ్యమంత్రి అన్నారు. దీనికి టీడీపీ నేతలు స్పందిస్తూ.. మా కాదని, మన ముఖ్యమంత్రి అన్నారు. దీనికి ఈటెల నవ్వుతూ ఓ సమాధానం చెప్పారు. మీ సీఎం ఇంకా చంద్రబాబు అనుకుంటున్నారేమో అనుకొని మా అంటున్నానని, మీరు కోరితే మన అని చెప్పేందుకు అభ్యంతరం లేదని నవ్వుతూ అన్నారు.
స్పీకర్ స్థానంలో కిష్టారెడ్డి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ సభ్యుడు పి. కిష్టారెడ్డికి అరుదైన అవకాశం లభించింది. మంగళవారం ఆయన సుమారు 25 నిమిషాల పాటు స్పీకర్ స్థానంలో కూర్చున్నారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆయన స్పీకర్గా వ్యవహరించి సభను నడిపించారు. అయితే ఆ సమయంలో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ఉన్నా.. ఆమె విశ్రాంతి కావాలంటూ వెళ్లడంతో కిష్టారెడ్డికి అనుకోని అవకాశం వచ్చింది.
సాధారణంగా స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు అందుబాటులో లేని సమయంలో సభను ప్యానెల్ స్పీకర్లు నడిపించాల్సి ఉంటుంది. అయితే సభలో ఇంకా ప్యానెల్ స్పీకర్లను నియమించలేదు. దాంతో సీనియర్ సభ్యుడైన కిష్టారెడ్డి పేరును శాసనసభ వ్యవహారాల మంత్రి హరీష్రావు ప్రతిపాదించారు.