రేవంత్ అరెస్ట్కు ముందు కేసీఆర్ కీలక వ్యాఖ్య: ఆపరేషన్ ఇలా, డీల్ ఈ ఫోన్లో
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అరెస్టుకు కొద్దిసేపటి ముందు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా వార్తలు వచ్చాయి. కేసీఆర్ ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యేలతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన... ఒక గంటలో మీరు ఓ వార్త వింటారు అని చెప్పినట్లుగా తెలుస్తోందని వార్తలు వచ్చాయి. ఆ వార్త గురించి ఎమ్మెల్యేల్లో చర్చ సాగింది. ఒకరి నుండి మరొకరి ఆరా తీసే ప్రయత్నం చేశారు. అంతలోనే రేవంత్ రెడ్డి డబ్బులతో సహా పట్టుబడ్డాడు. కేసీఆర్ వ్యాఖ్యలపై ఇప్పుడు చర్చ సాగుతోంది.
ఆపరేషన్ సాగిందిలా...
టాస్క్ ఫోర్స్, సిటీ పోలీసుల సాయంతో ఆపరేషన్ ప్రారంభమైంది. మే 31 ఆదివారం సికింద్రాబాద్ లాలాగూడలోని పుష్ప నిలయం వద్ద ఏసీబీ, పోలీసులు నిఘా ఉంచారు. సాయంత్రం నాలుగు గంటల నుండి పోలీసులు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యారు.
సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాలకు ఏపీ 09సీవీ9939 నెంబరు మహీంద్రా స్కార్పియో వాహనం వచ్చింది. అందులో రేవంత్ రెడ్డి, సెబాస్టియన్ వచ్చారు. తర్వాత కొద్దిసేపటికి టీఎస్ 10 యూఏ 1031 నెంబరుతో నల్ల రంగు వెర్నాకారు వచ్చింది. అందులో ఉదయసిన్హా వచ్చారు.
ఆయన బ్యాగుతో వచ్చారు. అందులోనే సొమ్ము ఉంది. పుష్ప నిలయం ప్లాట్ నెంబర్ 204లోకి ముగ్గురు వెళ్లారు. స్టీఫెన్తో మాటల అనంతరం అడ్వాన్స్ రూపంలో రూ.50 లక్షలు టీపాయ్ మీద పెట్టారు. మిగతా మొత్తాన్నిసోమవారం రాత్రి ఇస్తామని చెప్పారు.
కాగా, రేవంత్ రెడ్డి డీల్ సమయంలో ఉపయోగించిన ఫోన్ 8991072510గా వార్తలు వస్తున్నాయి. లావాదేవీలు దీని ద్వారానే నడిచినట్లుగా తెలుస్తోంది. కాగా, రేవంత్ రెడ్డికి ఏసీబీ న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది.